చోరీకి వచ్చి 6 నిమిషాల్లో దొరికిపోయాడు:టెక్నాలజీ పవర్
ఏలూరు:తేలిగ్గా డబ్బు సంపాదించేద్దామని దొంగతనానికి తెగబడిన ఈ చోరుడికి టెక్నాలజీ చుక్కలు చూపించి కటకటాలు లెక్కబెట్టిస్తోంది. చోరికి పాల్పడేందుకు ఓ ఇంట్లో దూరిన దొంగ కేవలం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఆరంటే ఆరే నిమిషాల్లో పోలీసులకు దొరికిపోయాడు. ఇలా ఒక దొంగని నిమిషాల వ్యవధిలోనే పట్టుకొని ఏలూరు పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు.
చోరీలను అరికట్టేందుకు పోలీసు శాఖ నూతనంగా ఏర్పాటు చేసిన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్(ఎల్హెచ్ఎంఎస్) అధ్భుతమైన ఫలితాలిస్తోంది. ఈ ఎల్హెచ్ఎంఎస్ సహాయంతో ఏలూరులో ఓ దొంగని పోలీసులు వెంటనే పట్టుకున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో మొదటగా కడపలో పోలీసులు 10 నిమిషాల్లో దొంగలను పట్టుకోగా...ఇప్పుడు ఏలూరు పోలీసులు కేవలం 6 నిమిషాలకే దొంగను పట్టుకొని ఇలా అతి తక్కువ సమయంలో దొంగను పట్టుకున్న పోలీసులుగా సరి కొత్త రికార్డు సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...
ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో డీఎస్పీ కె.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం...ఏలూరు మండలం సత్రంపాడు టెలిఫోన్ నగర్లో నివాసముంటున్న వైఎల్ఎన్ మూర్తి తాడేపల్లిగూడెం కోర్టులో ఉద్యోగిగా పనిచేస్తుంటారు. ఈయన కుటుంబంతో సహా గత నెల 29న తిరుపతి వెళ్లారు. అంతకు ముందు వారం కిందటే ఈయన తన మొబైల్ ఫోన్లో ఎల్హెచ్ఎంఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. తిరుపతికి వెళ్లేటప్పుడు యాప్ ద్వారా త్రీటౌన్ పోలీసులకు తాము మూడు రోజులపాటు ఇంటికి తాళాలు వేసి తిరుపతి యాత్రకు వెళుతున్నామని, కాబట్టి ఇంటికి రక్షణ కల్పించాలని పోలీసులకు విన్నవించుకుంటా మెసేజ్ పెట్టారు. దీంతో త్రీటౌన్ పోలీసులు ఆ ఇంటి వద్ద కెమేరాలను ఏర్పాటుచేశారు.
ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12.31 గంటలకు ఓ దొంగ ఆ ఇంటికి వచ్చి తాళాలు పగులకొట్టి లోపలకు చొరబడ్డాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు ఈ దృశ్యాలను చిత్రీకరించి వెంటనే పోలీసు కంట్రోలు రూమును అలారం ద్వారా ఎలెర్ట్ చేశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న బీటు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. వెంటనే బీటు కానిస్టేబుల్ సతీష్, మరో కానిస్టేబుల్ తో కలసి 12.37 గంటలకు ఆ ఇంటి లోపలికి ప్రవేశించి దొంగను పట్టుకున్నారు.
అనంతరం 12.40 గంటలకు ఎస్సై, 12.50 గంటలకు సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ అక్కడికి వెళ్లారు. ఆరు నిమిషాల వ్యవధిలో దొంగ ఇంటి లోపలకు చొరబడి బీరువాను తెరిచాడు. అందులో ఏమీ లేకపోవడంతో రూ.1000 కనిపిస్తే దానిని తీసుకుని మిగిలిన గదుల్లో వెతుకుతున్నాడు. పోలీసులు వచ్చిన అలికిడికి పారిపోతూ గోడ దూకే ప్రయత్నం చేయగా పట్టుకున్నారు. అతన్ని విచారించగా పాతనేరస్థుడైన మచిలీపట్నంకు చెందిన సొంటి దుర్గారావుగా తేలింది. ఇతడిపై పలు చోరీ కేసులున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రప్రథమంగా ఎల్హెచ్ఎంఎస్ యాప్ ద్వారా అతి తక్కువ సమయంలో దొంగను పట్టుకోవడం సంతోషంగా ఉందని డీఎస్పీఈశ్వరరావు తెలిపారు. ఈ లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టమ్పై ప్రజలు అవగాహన పెంచుకోని, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని రక్షణ పొందవచ్చని ఈ సందర్భంగా ఢిఎస్పీ సూచించారు.