బురఖా వేసుకొని ఇంట్లోకి చొరబడ్డ దొంగ...అరిచిందని పొడిచాడు
గుంటూరు:దొంగలు తెలివిమీరారు...పట్టపగలే ఎవరికీ అనుమానం రాకుండా దోపిడీలు చేసేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో చోరీకి వచ్చిన ఓ దోపిడీ దొంగ ఉదంతం జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే....
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో బురఖా వేసుకొన్న ఓ మహిళ హఠాత్తుగా ఓ ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంట్లో మహిళ వంటరిగా ఉండటం చూసి బురఖాతో వచ్చిన మహిళ తన నిజస్వరూపం చూపించగా, అప్పుడు ఆ బురఖా వేసుకొని వచ్చింది మహిళ కాదని పురుషుడు అని తెలిసింది. మొహంపై బురఖా ముసుగు తప్పించిన దొంగ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తి చూపుతూ బీరువాలోని నగదు, బంగారం తీసి ఇవ్వమని బెదిరించాడు.
దీంతో భయపడిపోయిన ఆ మహిళ ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ప్రతిఘటించింది. దీంతో కంగారు పడిన ఆ దొంగ మహిళను అరవద్దంటూ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈమె కేకలు విన్న చుట్టుపక్కలవారు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా మహిళను ఆస్పత్రికి తరలించి అనంతరం జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు.