బెజవాడలో ఘోరం: దొంగతనంకు వచ్చి మహిళ గొంతుకోశారు, 4రోజులుగా రెక్కీ
అమరావతి: విజయవాడలోని సత్యనారాయణపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగతనం చేసేందుకు వచ్చిన దుండుగులు ఓ ఇంట్లో దూరి ఒంటరిగా ఉన్న పద్మావతి అనే మహిళపై కత్తితో దాడి చేశారు. అనంతరం ఆమెపై ఉన్న నగలు, ఇంట్లోని బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరుతో ఇంట్లోకి వచ్చిన దుండగులు.. దొంగతనానికి యత్నిస్తుండగా.. పద్మావతి అడ్డుకుంది. దీంతో ఆమె మెడపై కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి పడేశారు. కాగా, నాలుగు రోజుల క్రితమే దుండగులు ఇక్కడ రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
పద్మావతి అరుపులు విన్న చంద్రశేఖర్ అనే స్థానికుడు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడివుంది. దీంతో స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. దుండగులు ఆమె చుట్టును కూడా కత్తిరించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ దోపిడీలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. 4బృందాలుగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
కాగా, పద్మావతిపై జరిగిన హత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు ఈ ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల స్థానికంగా తిరుగుతున్న ఇద్దరు అనుమానితులను చితకబాది పంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.