దివంగత సినీ నిర్మాత రామానాయుడు ఇంట్లో భారీ చోరీ
మూవీ మొఘల్ దివంగత దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో భారీ చోరీ జరిగింది. ప్రకాశం జిల్లాలోని ఆయన స్వగ్రామం కారంచేడులో ఉన్న ఇంట్లో దొంగలు పడి బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దొంగతనం జరగ్గా.. శనివారం ఉదయం పనిమనుషులు వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టినట్టు కనిపించింది.
దీంతో అదే గ్రామంలో ఉంటున్న ఆఫీస్ మేనేజర్ తాళ్లూరి శ్రీనివాసరావుకు సమాచారం అందించగా ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. దొంగలు పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ దొంగతనం చేశారని చెబుతున్నారు. రామానాయుడికి చెందిన ఆ ఇంట్లో ప్రస్తుతం ఆయన సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్ రావు నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్లో స్థిరపడటంతో.. తరుచూ అక్కడికి వెళ్లి వస్తుంటారు.
ఇదే క్రమంలో ఈ నెల 16వ తేదీన రామ్మోహన్ దంపతులు హైదరాబాద్ వెళ్లారు.ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. బీరువా పగలగొట్టి 10కేజీల వెండి వస్తువులు,మూడు సవర్ల బంగారం,రూ.60వేల నగదు ఎత్తుకెళ్లినట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. రామ్మోహన్ రావు దంపతులు హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత చోరీ సొత్తు గురించి పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.