చేసేదే చెబుతాం...చెప్పింది చేస్తాం: చంద్రబాబు; నిరుద్యోగ భృతి చాలా రాష్ట్రాల్లో విఫలమైంది:డొక్కా
విజయవాడ:అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజనతో కట్టుబట్టలతో నవ్యాంధ్రకు వచ్చామని...చాలా ఇబ్బందులు పడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అయినా అభివృద్ది విషయంలో తాము చేసేదే చెబుతామని...చెప్పింది చేస్తామని చంద్రబాబు అన్నారు.
Recommended Video
సిఎం చంద్రబాబు శుక్రవారం కృష్ణాజిల్లాలో పర్యటించారు. ముందుగా విస్సన్నపేట మండలం తాతకుంట్లలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచ్చబండలో గ్రామస్తులు, మహిళలతో సీఎం మాట్లాడి... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఈ నాలుగేళ్లల్లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించాలన్నారు.
తప్పు చేస్తే భయం ఉంటుందని...అందుకే విపక్షాలు అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు.
ఇదిలా వుండగా సీఎం చంద్రబాబు శనివారం చెన్నై వెళ్లనున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని పరామర్శించేందుకు గాను ఆయన చెన్నై బయలు దేరి వెళుతున్నారు. తన చెన్నై పర్యటన ముగించుకుని అదే రోజు సాయంత్రం సిఎం తిరుపతి చేరుకుంటారు. ఎస్వీయూలో విద్యార్థులతో 'జ్ఞానభేరి' పేరిట ముఖాముఖిలో పాల్గొంటారు. వారికి లక్ష్యాలను బోధించడంతో పాటు మెరుగైన పాలనకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు స్వీకరిస్తారు.
మరోవైపు నారా లోకేష్ను మంత్రిగా తీసుకోవడం వల్లే ఏపీకి ఐటీ కంపెనీలు వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్రావు చెప్పారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతి అమలుతో టీడీపీ మేనిఫెస్టో 99 శాతం అమలైనట్లేనని డొక్కా చెప్పుకొచ్చారు. నిరుద్యోగ భృతి చాలా రాష్ట్రాల్లో విఫలమైందని డొక్కా వెల్లడించారు.
బీజేపీ నేత సోము వీర్రాజు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని టిడిపి తరుపున ఖండిస్తున్నామన్నారు. వీర్రాజు వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఫీడ్ బ్యాక్ ప్రభుత్వం తెలుసుకుంటుందని చెప్పారు. అలాగే ప్రజల్లో మమేకం అవ్వడానికి గ్రామదర్శిని ప్రజాప్రతినిధులకు ఒక మంచి అవకాశంగా డొక్కా పేర్కొన్నారు.