నెల్లూరు వైసీపీలో మూడో వికెట్ ? మరో ఎమ్మెల్యే అసంతృప్తి ! ఆనం, కోటంరెడ్డి తర్వాత..
నెల్లూరు జిల్లాలో అసంతృప్త వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆనం, కోటంరెడ్డి రూపంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్త స్వరాలు వినిపిస్తుండగా.. మేకపాటి కూడా ఆ జాబితాలో చేరారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వందశాతం సీట్లు అందించిన మూడు జిల్లాల్లో ఒకటైన నెల్లూరులో ఇప్పుడు అనూహ్యంగా అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూపంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
నెల్లూరు పెద్దారెడ్డ పోరుబాట
నెల్లూరు జిల్లాలో పెద్దరెడ్లుగా పేరొందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిద్దరూ కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తమను ట్రీట్ చేస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా రెండోసారి జగన్ కేబినెట్ విస్తరణ సందర్భంగా వీరికి చోటు కల్పించలేదన్న అసంతృప్తి వీరిని వేధిస్తోంది.
దీంతో తాజాగా స్వరం పెంచారు. అంతే ముందు ఆనం నియోజకవర్గం వెంకటగిరిలో వైసీపీ మరో ఇన్ ఛార్జ్ ను నియమించింది. ఆ తర్వాత ఇప్పుడు కోటంరెడ్డి నియోజకవర్గం నెల్లూరు రూరల్ లోనూ నియమించేందుకు సిద్ధమవుతోంది. దీనికి తోడు వీరిద్దరూ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీని చిక్కుల్లోకి నెడుతున్నాయి.
ఆనం, కోటంరెడ్డి బాటలో మరో ఎమ్మెల్యే?
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఆనం, కోటంరెడ్డి రూపంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న తిరుగుబాటుతో అధిష్టానం ఇరుకునపడుతోంది. దీంతో వీరిద్దరికీ చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇన్ ఛార్జ్ ల నియామకంతో వీరిద్దరికీ పొమ్మనలేక పొగబెట్టేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే ఆనం స్ధానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించిన జగన్.. ఇప్పుడు కోటంరెడ్డి స్ధానంలోనూ మరొకరి కోసం అన్వేషిస్తున్నారు. తాజాగా వీరిద్దరి తరహాలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా అధిష్టానంపై గొంతు విప్పారు.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గరంగరం
నెల్లూరు జిల్లాలో ఇవాళ మరో వైసీపీ ఎమ్మెల్యే అధిష్టానం తీరుపై విమర్శలకు దిగారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. తన నియోజకవర్గంలో అధిష్టానం నియమించిన పరిశీలకుడు ధనుంజయ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ తోనూ, ఆయన తండ్రి వైఎస్ తోనూ తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మరీ ఆయన్ను టార్గెట్ చేశారు. ఏకపక్ష నిర్ణయాల్ని జగన్ తోనే తేల్చుకుంటానని కూడా మేకపాటి చెప్పేశారు. దీంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇబ్బందులు పడుతున్న జగన్ కు కొత్త సమస్య వచ్చి పడినట్లయింది.
మేకపాటి అసంతృప్తి వెనుక?
ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ పరిశీలకుడిగా ధనుంజయ రెడ్డిని అధిష్టానం నియమించింది. దీంతో ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నేతలను సమన్వయం పర్చకుండా ధనంజయరెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఆరోపించారు.
దీన్ని జగన్ దృష్టికి తీసుకెళతాన్నారు. పార్టీలో ఇబ్బందులున్నా, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నా వారిని సర్దుబాటు చేయాల్సిన ధనుంజయ్ రెడ్డి తన వ్యతిరేకులతో కుమ్మక్కయ్యారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
ఆయన పెత్తనాన్ని తాము సహించమని తేల్చి చెప్పారు. ధనుంజయ్ రెడ్డి వల్ల పార్టీకి తీరని నష్టమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా ధనంజయరెడ్డిని వెనక్కు పిలిపించకపోతే నియోజకవర్గంలో పార్టీ పట్ల వ్యతిరేకత ఎక్కువవుతుందన్నారు.