'మోడీ ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు, మాట్లాడవచ్చు కదా, బీజేపీకి అనుకూలంగా'
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇంత ద్రోహం చేస్తారని తాము అనుకోలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం సభ వాయిదా పడిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎంపీలు కావాలనే లోకసభను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సభలో అవిశ్వాసంపై చర్చ జరిగితే వారి సమస్యలను కూడా లేవనెత్తవచ్చు కదా అని వ్యాఖ్యానించారు.
టీడీపీతో కటీఫ్కు తొలి అడుగు: హోదా- వెంకయ్యపై బీజేపీ సేఫ్ సైడ్ ప్లాన్?
ఇంత ద్రోహం చేస్తారని ఊహించలేదు
రోజుల తరబడి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడం లేదని టీడీపీ ఎంపీలు విమర్శించారు. ఆంధ్ర ప్రజలకు మోడీ ఇంత ద్రోహం చేస్తారని తాము భావించలేదన్నారు.
ఆ నిధులు ప్రహరీ గోడకే సరిపోతాయి
గతంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఇప్పుడు బీజేపీ చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలతో మాట్లాడేందుకు నరేంద్ర మోడీకి వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలని నిలదీశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు ప్రహరీ గోడ నిర్మించడానికే సరిపోతాయన్నారు.
అవిశ్వాస తీర్మానంపై కేంద్రం పారిపోతోంది
అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా కేంద్రం పారిపోతోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. లోకసభలో అన్నాడీఎంకే ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చర్చ జరగనివ్వకుండా అడ్డుతగులుతున్నారన్నారు.
ప్రతిరోజు అవిశ్వాస తీర్మానం ఇస్తున్నా
తాము ప్రతిరోజు అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇస్తున్నా పార్లమెంటులో చర్చ జరపడం లేదని గల్లా జయదేవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు లోకసభ స్పీకర్ ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారన్నారు. అవిశ్వాస తీర్మానంపై బుధవారం టీడీపీ ఎంపీ తోట నర్సింహం నోటీసులు ఇచ్చారు.