ఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలు
Recommended Video
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం ఆయన తన గదికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఉదయం పది గంటలకు భార్యతో కలిసి టిఫిన్ చేసిన ఆయన మొదటి అంతస్తులో ఉన్న తన బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. కాసేపటి తర్వాత డోర్ లాక్ చేసినట్లు గుర్తించి, భార్య తలుపులు తెరవాలని ఎంత పిలిచినా బయటకు రాలేదు. గన్ మెన్ సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే ఫ్యాన్కు ఉరివేసుకున్న కోడెలను కారులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ముగిసిన కోడెల రాజకీయ ప్రస్థానం ... ఆరుసార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా , స్పీకర్ గా ...
కేశినేని నాని తీవ్ర ఆరోపణ
ఈ ఆత్మహత్యపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని నేరుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది (కోడెలది) ఆత్మహత్య కాదని, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణ హత్య అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో 'కోడెలశివప్రసాదరావు గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను.' అని పేర్కొన్నారు.
చనిపోయారని ప్రచారం.. అది అవాస్తవం...
కోడెల శివప్రసాద రావు ఉరేసుకొని చనిపోయారని ప్రచారం సాగుతోందని, అది అవాస్తవమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోడెల మెడపై గాట్లు ఉన్నాయన్నారు. శవపరీక్ష కోసం ఆయన భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు. వైద్యులు ఎంతో శ్రమించినా ప్రాణాలు కాపాడలేకపోయారన్నారు.
ఆత్మహత్యనా.. కాదా?
మరోవైపు, కోడెల శివప్రసాద రావుది ఆత్మహత్యనా, కాదా అనే విషయం పోస్టుమార్టం రిపోర్టు అనంతరం తేలుతుందని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. కోడెల ఉరివేసుకున్నారని, ఆసుపత్రికి తీసుకు వచ్చే సమయానికి చనిపోయారని కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. ఉదయం 11 గంటలకు తన పడక గదిలో పడి ఉన్నారని, భార్య, కూతురు, పనిమనిషి ఆసుపత్రికి తీసుకు రాగా, వైద్యులు ఆయన చనిపోయినట్లు నిర్ధారించారన్నారు.