ఇది పులివెందుల సంస్కృతి : సీఎం జగన్ పై మండిపడిన ఎంపీ కేశినేని నానీ
ఏపీ సీఎం జగన్పై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ సీఎం జగన్ వైఖరిపై సీరియస్ అయిన కేశినేని నానీ స్థానిక ఎన్నికల నేపధ్యంలో జగన్ అప్రజాస్వామిక విధానాలతో ప్రజల వద్దకు వెళ్తున్నారని మండిపడ్డారు . హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నారని, ఇలాంటి స్థానిక ఎన్నికలను గతంలో తాను ఎన్నడూ చూడలేదని అన్నారు.
అడుగడుగునా బెదిరింపులు ..జగన్ ది పులివెందుల సంస్కృతి
ఇక జగన్ మంత్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎన్నికలలో వైసీపీ ఓడితే పదవులు పోతాయని జగన్ మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారని, జిల్లా ఎస్పీలను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతలను నామినేషన్ వేయనీయకుండా బెదిరింపులకు పాల్పడుతూ పులివెందుల సంస్కృతిని రాష్ట్రమంతా తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం జగన్ పతనం విజయవాడ నుండే ఆరంభం అవుతుందని కేశినేని నానీ సవాల్ చేశారు .
ఓటమి భయంతోనే అమరావతి గ్రామాలలో ఎన్నికలు నిలిపివేత
సీఎంగా జగన్ ఫెయిల్ అయ్యారని కేశినేని నానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే అమరావతి గ్రామాలలో ఎన్నికలు ఆపేశారని అన్నారు. స్వార్థం కోసం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు నాని. కృష్ణా గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని, ప్రతి ఒక్కరు జగన్కి బుద్ధి చెప్పండని కేశినేని నానీ అన్నారు.
ఈ ఎన్నికలతోనే సీఎం జగన్ పతనం ప్రారంభం అన్న ఎంపీ నానీ
కేసులకు భయపడి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని కేంద్రం మెడలు వంచుతానని చెప్పి కాళ్లు పట్టుకుటున్నారని ఎంపీ నానీ ధ్వజమెత్తారు . కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ పీఠంతో పాటు విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నామని టీడీపీ ఎంపీ ధీమావ్యక్తం చేశారు. 75 శాతం సీట్లు గెలవబోతున్నామన్న నానీ జగన్ ఎంత మంది మంత్రులతో రాజీనామా చేయిస్తారో చూద్దామని అన్నారు. ఇక స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. అలా జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్లను టీడీపీ గెలుస్తుందన్నారు నానీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పేర్కొన్న నానీ ఈ ఎన్నికలతోనే సీఎం జగన్ పతనం మొదలవుతుందని నానీ అల్టిమేటం ఇచ్చారు.