జగన్ మకాం అమరావతికి మార్చటానికి రీజన్ ఇదే .. గెలుపు ధీమాతో జోష్ లో ఉన్న జగన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు కంటే జగన్ తమ పార్టీ విజయం సాధిస్తుంది అన్న ధీమాలో ఉన్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు ఇంకా గెలుపుపై సందిగ్ధంలో ఉన్నట్టు ఆయన మాటలతోనే అర్ధం అవుతుంది. తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ధీమాతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది . ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తాన్ని కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేనా జగన్ పార్టీ కి సంబంధించి క్యాబినెట్ పై కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతుంది.
లోటస్ పాండ్ నుండి మకాం మారుస్తున్న జగన్ ... ఎందుకంటే
నిన్నా మొన్నటి వరకు లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ఇక తన మకాం ను పూర్తిగా అమరావతికి మారుస్తున్నారు. జగన్ ఈ నెల 22వ తేదీన ఉండవల్లికి తన పూర్తిగా మకాం మారుస్తున్నారు. దానికి ముందే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయం అమరావతి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుందని అంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమాతోనే ఆయన ఈ తరలింపు కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు చెబుతున్నారు. చాలా స్ట్రాంగ్ గా విజయం తమదేనని నమ్ముతున్నారు జగన్.
జగన్ ప్రమాణ స్వీకారానికి స్వరూపానందేంద్ర స్వామి నిర్ణయించిన ముహూర్తం
ఇప్పటికే పలు జాతీయ సర్వేలు సైతం విజయం వైసీపీదే అని చెప్పటం, పీకే సర్వేలో సైతం వైసీపీ విజయం సాధిస్తుంది అని చెప్పటంతో జగన్ మంచి జోష్ లో ఉన్నారు. వైసిపి గెలిస్తే జగన్ ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జోరుగానే సాగుతూ వస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నాడీ జ్యోతిష్కుడు కాళిదాస్ ఆ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు చెప్తున్నారు. అయితే, అది వాస్తవం కాదని వైసిపి వర్గాలంటున్నాయి. వాస్తవానికి వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. విశాఖకు చెందిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఈ ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. స్వరూపానందేంద్ర స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనే ఈ ముహూర్తం నిర్ణయించారని తెలుస్తుంది.
తామే కింగ్ అన్న ధీమాలో వైసీపీ .. జగన్ క్యాబినెట్ పై రాష్ట్ర వ్యాప్త చర్చ
ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తమదే అధికారం అంటూ ధీమాగా ఉంది. తామే కింగ్ అంటూ చెప్పుకుంటోంది. ఈసారి ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ గట్టిగా నమ్ముతోంది వైసీపీ. అంతేకాదు వైసీపీలో కీలక నేతలు తమకు మంత్రి పదవులు వస్తాయంటూ ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. కొందరు అభిమానులైతే కాబోయే మంత్రి, కాబోయే ఎమ్మెల్యే అంటూ స్టిక్కర్లు ఫ్లెక్సీలు వేసుకుని మరీ హల్ చల్ చేస్తున్నారు. జగన్ పార్టీలో ఉన్న జోష్ , టీడీపీలో కనిపించటం లేదు. జగన్ పార్టీ ఆఫీసు, మకాం పూర్తిగా అమరావతికి మార్చటం , పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్సాహం , జగన్ కాన్ఫిడెన్స్ వెరసి జగన్ పార్టీ విజయం సాధిస్తుంది అన్న ధీమా వైసీపీలో కనిపిస్తుంది.