మీరు మాకొద్దు!: కీలక నేతలకు పవన్ కళ్యాణ్ డోర్లు క్లోజ్? ప్రజారాజ్యంలో ఏం జరిగిందంటే?
అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికలు మరో రెండు నెలలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇతర పార్టీల నుంచి కీలక నేతలు ఎక్కువ మంది జనసేనలో చేరడం లేదు.
జనసేనలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. పవన్ వద్దంటున్నారట
ఇటీవల ఆకుల సత్యనారాయణ, నాదెండ్ల మనోహర్, రావెల కిషోర్ బాబు వంటి నేతలు జనసేన పార్టీలో చేరారు. కానీ ఆ తర్వాత పెద్ద నేతలు ఎవరూ కనిపించడం లేదు. అయితే, టీడీపీ, వైసీపీల నుంచి కొందరు నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, కానీ వారికి జనసేన నో చెబుతోందనే ప్రచారం సాగుతోంది. కొందరు సీనియర్ నేతలు వస్తానని చెప్పినప్పటికీ పవన్ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదట.
రెండుమూడుసార్లు కలిసినా పవన్ ఆసక్తి చూపలేదట
ఇటీవల ఓ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరకముందు జనసేనానిని కలిసినట్లుగా తెలుస్తోంది. ఆయితే ఆయనకు పవన్ కళ్యాణ్ పచ్చజెండా ఊపలేదట. సదరు ఎమ్మెల్యే దాదాపు మూడు నాలుగుసార్లు జనసేనానిని కలిశారట. కానీ అధినేత నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మరో పార్టీలో చేరిపోయారని చెబుతున్నారు.
ప్రజారాజ్యం పార్టీ అనుభవం
ప్రజారాజ్యం పార్టీ అనుభవం నేపథ్యంలో జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా జనసైనికులతో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి 40 మంది సీనియర్ నేతలు వచ్చారని, కానీ వారంతా ఓటమి చవి చూశారని చెప్పారట. దేవేందర్ గౌడ్, కోటగిరి విద్యాధర రావు, కళా వెంకటరావు వంటి మహామహులు ఓడిపోయారని గుర్తు చేస్తున్నారట.
వీరు గెలిచారు
అంతేకాకుండా, ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో 18 మంది మాత్రమే గెలిచారని, అందులో అప్పటికి జూనియర్లుగా ఉన్నవారు లేదా కొత్తవారైన వంగా గీత, అనిల్, కన్నబాబు వంటి వారు గెలిచారని గుర్తు చేస్తున్నారట. వంగా గీత వంటి వారు నాటికి టాప్ లీడర్ అయిన ముద్రగడ పద్మనాభంను ఓడించారని చెబుతున్నారట. కాబట్టి సీనియార్టీ ఉంటేనే గెలుస్తామని అనుకోవద్దని, ఎన్నో అంశాలు చూసుకోవాలని చెబుతున్నారట.