జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిందా .. రీజన్ ఇదేనా ?
ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఏపీ సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం . అయితే అందుకు కారణం లేకపోలేదు . గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు జగన్ స్వయంగా ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు వేరే కార్యక్రమాల్లో ఉండటంతో ఫోన్ లో మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత వైసీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారని తెలుస్తుంది .
గతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గానీ, అమరావతి శంకుస్థాపనకు కానీ జగన్ రాలేదు .2014లో తాను సీఎంగా చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరేందుకు ప్రయత్నించగా జగన్ అందుబాటులో లేకుండా పోయారు . జగన్ హాజరుకాలేకపోయినా కనీసం వైసీపీ ప్రతినిధి బృందాన్ని సైతం పంపలేదు. ఇకపోతే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు కూడా హాజరు కావాలని మంత్రుల బృందం వైయస్ జగన్ నివాసమైన లోటస్ పాండ్ కు వెళ్ళింది . ఇంటికి వెళ్ళిన వారిని అవమానించి మంత్రుల బృందాన్ని కలిసేందుకు జగన్ నిరాకరించారు.
ఈ పరిణామాలను గుర్తుకు తెచ్చిన టీడీపీ శ్రేణులు జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావొద్దని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం . అంతేకాదు జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కార్యకర్తలు తొందరపడొద్దని చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తుంది. మొత్తానికి జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు దూరంగా వుండాలనే నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నట్టు తెలుస్తుంది.