టైమొచ్చింది: మోడీ షాక్తో రంగంలోకి.., పవన్ కళ్యాణ్పై ఎక్కువ బాధ్యతే!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గుట్టు వీడుతోంది! ఢిల్లీ పెద్దల వ్యాఖ్యలు చూస్తుంటే హోదా రాకపోవచ్చుననే చెబుతున్నారు. అదే సమయంలో బీహార్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండవచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీహార్ ఎన్నికల తర్వాత.. కాస్త ఆలస్యంగానైనా ప్రత్యేక హోదా ఇస్తే ఏపీకి సంతోషమే. కానీ ప్రస్తుత కేంద్రమంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే పరిస్థితి అలా కనిపించడం లేదు.
ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాల పైన నీతి అయోగ్ సీఎంల సబ్ కమిటీ చర్చిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అంతకుముందు పార్లమెంటులో కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ఇదే విషయం చెప్పారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఏపీలో దాని కోసం పెద్ద ఎత్తున ఉద్యమం పుట్టుకు వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. ఇప్పటికే విపక్ష వైసీపీ, కాంగ్రెస్ సహా పలు ప్రజా సంఘాలు ప్రత్యేక హోదా పైన ఏపీ, కేంద్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నాయి.
నటుడు శివాజీ నిత్యం రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటు హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదా సాధిస్తామని, కేంద్రంతో స్నేహంగా ఉంటూ హోదా తెస్తామని చెబుతున్నారు. బిజెపి నేతలు హోదా వస్తుందని కొందరు, హోదాతో పనేంటని మరికొందరు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా బాధ్యత బిజెపి, తెలుగుదేశం పార్టీల పైనే ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి హామీ ఇచ్చిందని, అదేవిధంగా బిజెపితో టిడిపి దోస్తీ కట్టిందని కాబట్టి ఆ రెండు పార్టీలే తీసుకు రావాలని విపక్షాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇష్టారీతిన విభజించింది కాంగ్రెస్ పార్టీ అని, హోదా పైన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, దీంతో హోదా బాధ్యత ఆ పార్టీ పైన కూడా ఉందని టిడిపి చెబుతోంది. విభజనకు జగన్ కారణమని, ఆయన ప్రత్యేక హోదా రాకుండా చూస్తున్నారని ఆరోపించింది.
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని తెలిస్తే విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధమవుతున్నాయి. వారితో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి వస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రధానంగా ప్రత్యేక హోదా బిజెపి, టిడిపి బాధ్యత అని అందరు భావిస్తున్నారు. ఈ పార్టీలతో పాటు పవన్ కళ్యాణ్ పైనా ఎక్కువ బాధ్యత ఉందని అంటున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో... టిడిపి - బిజెపి కూటమి హామీలు విశ్వసించి పవన్ కళ్యాణ్ వారికి మద్దతు పలికారని గుర్తు చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రావడానికి పవన్ కళ్యాణ్ సహకారమేనని లేదంటే జగన్ అధికారంలోకి వచ్చేవారనే వాదన ఉంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ బిజెపి - టిడిపి కూటమికి మద్దతు పలికారని, అంతేకాకుండా, తాను మద్దతిచ్చిన పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తాను నిలదీస్తానని, ప్రశ్నిస్తానని కూడా చెప్పారు.
అలాగే, విభజన కారణంగా ఏపీ తీవ్ర ఆర్థిక లోటులో ఉందని, ఇలా ఏ రకంగా చూసినా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికిన నాయకుడిగా ప్రత్యేక హోదా పైన కేంద్రాన్ని నిలదీసే బాధ్యత పవన్ పైన ఎక్కువగానే ఉందని చెబుతున్నారు.