బస్సు ప్రమాదం-మావల్ల కాదన్న వైసిపి నేతలు: ఆ రోజు జగన్ ఏం చేశారంటే..!
నందిగామ పరిధిలో గత ఫిబ్రవరి 28న జరిగిన బస్సు ప్రమాదానికి బాధ్యుడైన డ్రైవర్ శరీర భాగాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదివారం నాడు తెలిపారు.
విజయవాడ: నందిగామ పరిధిలో గత ఫిబ్రవరి 28న జరిగిన బస్సు ప్రమాదానికి బాధ్యుడైన డ్రైవర్ శరీర భాగాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదివారం నాడు తెలిపారు.
దివాకర్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు ఒడిసాలోని కటక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతూ... జరిగిన పరిణామాలపై ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నాతో జగన్కు పని ఉంది.. నాకవసరం లేదు, అందుకే అలా: జేసీ
ప్రమాదంలో మొత్తం పదిమంది చనిపోగా, వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారని తెలిపారు. ప్రమాద సమయంలో డ్రైవర్ ఆదినారాయణ మద్యం మత్తులో ఉన్నాడో, లేడో తెలుసుకునేందుకు శరీర భాగాలను పరీక్షలకు పంపించామన్నారు.
ప్రమాద తీవ్రత ఆదినారాయణపైనే ఎక్కువగా ఉందని తెలిపారు. శరీరం నుజ్జుగా మారిందన్నారు. మృతదేహాన్ని బస్సులో నుంచి బయటకు తీయడానికి చాలా సమయం పట్టిందన్నారు.
ముక్కలైన మృతదేహాన్ని చాపలో చుట్టి పోస్టుమార్టం కోసం చివరిలో తరలించాల్సి వచ్చిందన్నారు. పోలీసులు శవ పంచనామా చేశారని, ఆ కాపీని డాక్టర్కు ఇచ్చి శవ పరీక్ష నిర్వహించాల్సిందిగా విజ్ఞాపన పత్రం అందజేశారన్నారు.
జగన్ లాక్కుంటే.. డాక్టర్ బతిమాలారు
ఆ కాగితాలను డాక్టర్ శ్రీను నాయక్ చేతిలో నుంచి వైసిపి అధినేత జగన్ లాక్కున్నారన్నారు. తిరిగి ఇవ్వక పోవడంతో డాక్టర్ నాయక్ ఆయన్ను బతిమాలారన్నారు. అది పోస్టుమార్టం రిపోర్టు కాదని, పోలీసులు ఇచ్చిన పంచనామా కాపీ, విజ్ఞాపన మాత్రమేనని చెప్పినా జగన్ వినిపించుకోలేదన్నారు.
జగన్కు చెప్పడం వల్ల కాదని..
తాను ప్రతిపక్ష నాయకుడినని, ఒక కాపీ తనకు ఇవ్వాలంటూ డాక్టర్ను గద్దించారని, పోస్టుమార్టం గదిలోనే జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారిందని, మీడియా సమావేశం బయట ఏర్పాటు చేసుకోవాలని వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను, తదితరులకు కృష్ణా జిల్లా కలెక్టర్ చెప్పగా... తమ వల్ల కాదని ఆ నాయకులు చెప్పారన్నారు.
అందుకు కలెక్టర్పై జగన్ ఆగ్రహం
దాంతో కలెక్టర్ జగన్కు విజ్ఞప్తి చేశారని, ఇందుకు ఆయన తీవ్ర ఆగ్రహంతో కలెక్టర్పై విరుచుకు పడ్డారని తెలిపారు. పోస్టుమార్టం కోసం ఎనిమిది మంది డాక్టర్లను, శవపంచనామాకు పోలీసు అధికారులను ప్రత్యేకంగా నియమించామన్నారు.
అంతకుముందు..
అంతకుముందు, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ తయ్యద్ మృతదేహాన్ని తరలిస్తుండగా వైసీపీ నాయకులు అడ్డుపడ్డారని, తమ పార్టీ అధ్యక్షులు జగన్ వస్తున్నారని, మృతదేహాన్ని అక్కడే ఉంచాలని డిమాండ్ చేశారని తెలిపారు. దీనిపై నేను, కలెక్టర్ బాబు ఎంత చెప్పినా వైసీపీ నాయకులు వినిపించుకోలేదన్నారు.
జగన్ వచ్చి ఇలా..
మధ్యాహ్నం 3.30 సమయంలో వచ్చిన జగన్ తొలుత సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడి నుంచి నందిగామ ఆసుపత్రికి వచ్చారని, కలెక్టర్తో పది నిమిషాలు మాట్లాడి బస్సు పర్మిట్ కాపీ కావాలని కోరారని, తర్వాత మృతదేహాలు ఉంచిన గదిలోకి వడివడిగా వెళ్లారని, అప్పటికే తొమ్మిది మృతదేహాలలో ఎనిమిది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందన్నారు.
డ్రైవర్ మృతదేహం ముక్కలై ఉండడం వల్ల బస్సులో నుంచి తీయడం ఆలస్యమైందని, దీంతో పోస్టుమార్టం ఆఖరిలో చేయాల్సి వచ్చిందని, దీనిపై రాద్ధాంతం చేశారని ఎస్పీ తెలిపారు.