జగన్ ఓ మూర్ఖుడు..కరడు గట్టిన ఉగ్రవాదిలా సీఎం తీరు..ఈ ఏడాది కష్టాల సంక్రాంతి: చంద్రబాబు
రాజధాని అమరావతి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం సాగిస్తున్నారు . ఈ సారి సంక్రాంతి పండుగ జరుపుకోనని ప్రకటించిన చంద్రబాబు రాజధాని రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ మీద నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ఒక మూర్ఖుడని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సారి సంక్రాంతి కష్టాల సంక్రాంతి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది 29 గ్రామాల సమస్య కాదు ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అన్నారు చంద్రబాబు . కుటుంబ సభ్యులతో కలిసి మందడంలో రాజధాని రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారు చంద్రబాబు.
రైతులకు అండగా ఉన్నామన్న బాబు... అధైర్యపడవద్దని హితవు
29 గ్రామాల రైతులు త్యాగాలు చేశారని వాటిని సీఎం జగన్ గుర్తించటం లేదన్నారు. సంక్రాంతి రోజు రైతులు, మహిళలతో ఉన్నామని చెప్పిన చంద్రబాబు రైతులు అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని చెప్పారు. రైతులకు అండగా తామున్నామని చెప్పారు. రాజధాని రైతుల విషయంలో ప్రభుత్వం ఇష్టంమొచ్చినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామకృష్ణ కమిటీ పరిశీలించి ఇచ్చిన నివేదికను బట్టే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామని చెప్పారు.
జగన్ కరుడు కట్టిన ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
ఇప్పటివరకు తన జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ని చూడలేదని పేర్కొన్న చంద్రబాబు జగన్ కరుడు కట్టిన ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది ముంపు ప్రాంతం కాదని,ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందిఅని లేనిపోనివి సృష్టించి రైతుల మీద కోపం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో ఉన్నవన్నీ పర్మినెంట్ బిల్డింగ్స్ అని పేర్కొన్నారు.
రైతులు త్యాగాన్ని గుర్తించలేని స్థితిలో సీఎం వున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రాజధాని ఒకే చోట నిర్మించాలి కానీ ఇన్ని చోట్ల కాదు అని పేర్కొన్నారు.
అమరావతిని చంపేసి ఓ కన్ను పోగొట్టారు
చట్ట ప్రకారం సీఆర్డీఏ ఏర్పాటు చేసి,నిర్మాణం మొదలు పెట్టామన్న చంద్రబాబు అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్ళు అని అందులో ఒక కన్ను పోగొట్టేశారని చెప్పారు.
అమరావతిని చంపేసి ఒక కన్ను పోగొట్టారని జగన్ పై నిప్పులు చెరిగారు. పోలవరం పనులు ఆపేసి, రెండో కన్నుకుడా చంపేసేలా వున్నారని మండిపడ్డారు. తాను అధికారంలో ఉన్న సమయంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశానని చెప్పిన ఆయన అమరావతి కంటే ముందుగా కియా మోటార్స్ వచ్చిందని పేర్కొన్నారు.
అమరావతి రైతుల కోసం జోలె పట్టానన్న బాబు
ఒకే ప్రాంతంపై నాకు అభిమానం లేదని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతం అని చెప్పారు చంద్రబాబు. చాలా మంది భూములు ఇచ్చిన రైతులు గుండె పోటుతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడు జోలె పట్టుకోలేదు అలాంటి అమరావతి రైతుల కోసం పట్టుకున్నానని ఆయన చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎడ్ల పందాలకు వెళ్లే తీరిక ఉంది కానీ రైతులు చనిపోతే పట్టించుకునే తీరిక లేదన్నారు. ఎడ్ల పందాలు,కోడి పందాలు ,పేకాటలు ఆడుకోవడంలో మంత్రులు బిజీగా వున్నారని మండిపడ్డారు.
రైతులు ఏమైనా ఉగ్రవాదులా? ఎందుకీ పోలీసు జులుం
ఏ ఒక్క మంత్రికి రైతుల గోడు కనపడటం లేదని వైసీపీ మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు . రైతులు హక్కుల కోసం పోరాడుతున్నారు. రైతులేమన్నా ఉగ్రవాదులా..? వారిపై పోలీసులు జులుం చూపిస్తున్నారు అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. విదేశాల్లో వుండే ఏపీ వాసులు ఇక్కడికి వచ్చేసేలా రాజధాని నిర్మాణం చేపట్టామని చెప్పిన చంద్రబాబు అభివృద్ధి చెందుతుంది అనే అందరూ భూములు ఇచ్చేటప్పుడు సహకరించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఖరి వల్ల ఐదుకోట్ల ప్రజల జీవితాల్లో అంధకారం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఆర్డీఏ చట్టాన్ని ఏకపక్షంగా రద్దు చేస్తే వూరుకోమన్న బాబు
ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు చంద్రబాబు . ఇక్కడి రైతుల పోరాట పటిమ రాష్ట్రంలో అందరూ చూసి నేర్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.
రాష్ట్రం మొత్తం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే యోచలో ఉందని ఏక పక్షం గా ఒక చట్టాన్ని రద్దు చేయడం కుదరదని చంద్రబాబు పేర్కొన్నారు.