ఈ సారి భద్రత విషయంలో..జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ సర్కార్ మరో షాక్
అనంతపురం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఏపీలోని వైసీపీ సర్కార్ కోలుకోలేని మరో షాక్ ఇచ్చింది . ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు జేసీకి సంబంధించిన వ్యాపారాలలో అక్రమాలు జరుగుతున్నాయని ఆధారాలతో ప్రూవ్ చేసే పనితో ఆర్ధిక మూలాలపై దెబ్బ కొడుతున్న సర్కార్ ఇక ఏకంగా జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వ భద్రతను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ సర్కార్ ఊహించని షాకులు
టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ సర్కార్ నుండి ఊహించని విధంగా వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మొదట జేసీ బ్రదర్స్ కు చెందిన దివాకర్ ట్రావెల్స్ నిబంధనలు పాటించటం లేదని బస్సులు సీజ్ తో మొదలు పెట్టిన సర్కార్ మెస్సర్ త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ లీజ్ రద్దు , ఇక తాజాగా ట్రావెల్స్ ఫోర్జరీ కేసు వరకూ వరుసగా షాకులు ఇస్తూనే ఉంది . అది సరిపోదు అన్నట్టు తాజాగా ఆయనకు మరో షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్.
జేసీకి ప్రభుత్వ సెక్యూరిటీని నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీని నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయాక ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ఈ నేపధ్యంలో గన్మెన్ లను 2+2 నుంచి 1+1 కు ఏపీ ప్రభుత్వం కుదించింది. ఇక తాజాగా ఆయన భద్రత కోసం కేటాయించిన 1+1 గన్మెన్లను కూడా పూర్తిగా తొలిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఏపీ రాజకీయ వర్గాల్లో , అనంతపురం జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
జేసీ దివాకర్రెడ్డికి భద్రత తొలగింపు ... టీడీపీకి షాక్
రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత రాత్రి జేసీ దివాకర్రెడ్డికి భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం జేసీ దివాకర్ రెడ్డికి మాత్రమే పరిమితం కాదని టీడీపీ హయాంలో మంత్రులుగా ఉన్న వారికి , మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు ఉన్న గన్మెన్లను ఉపసంహరించుకోవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందని కూడా సమాచారం . ఇక కొందరికి భద్రతను తగ్గించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయం మీద అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఏది ఏమైనా జేసీ భద్రత పూర్తిగా తొలగించటంపై ఏపీలో చర్చ జరుగుతుంది. టీడీపీ నేతలకు భద్రత కరువు అన్న భావన టీడీపీ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది .