ఈ విద్యా సంవత్పరానికి పాత ఫీజులే..! ప్రకటన చేయనున్న ఏపి ప్రభుత్వం..!!
అమరావతి/హైదరాబాద్ : ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం తీపి కుబురు వచ్చింది. ఈ సంవత్సరం ఫీజుల అంశంలో ఎలాంటి పెరుగుదల ఉండదని ఏపిలోని అన్ని ఇంజనీరింగ్, మరియు వృత్తి విద్యను చదువుకునే విద్యార్థులు తమ ఫీజులను యధావిధిగా చెల్లించాలని, అదికంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లదేని తెలుస్తోంది. ఇందుకు సంబందించి ఏపి అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ మార్గ దర్శకాలను విడుదల చేసింది. నియమాలను ఏ కాలేజీ అతిక్రమించినా చర్యలు తప్పవని తెలుస్తోంది.
Recommended Video
అర్హులందరికీ పూర్తిగా రీయింబర్స్ చేసే అవకాశం..!ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీలన్నింటికీ వర్తింపు..!!
ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తివిద్య కళాశాలలన్నింటిలో ఈ ఏడాది (2019-20 విద్యా సంవత్సరం) కూడా పాత ట్యూషన్ ఫీజులు, ప్రత్యేక ఫీజుల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) 2019-20, 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల కోసం ప్రతిపాదించిన ఫీజులను ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టాలని యోచిస్తోంది. అయితే ఈ కమిటీ రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైనది కావడంతో ప్రతిపాదిత ఫీజులను ఇప్పటికిప్పుడు తిరస్కరించరాదని, వాటిని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు ప్రస్తుతానికి పెండింగ్..!నేడో, రేపో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన..!!
ఇంజనీరింగ్ ఫీజులకు సంబంధించి తెలంగాణలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ కాలేజీల ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, జీతాల చెల్లింపు తదితర అంశాలను పరిశీలించిన ఏఎఫ్ఆర్సీ ప్రతి మూడేళ్ల కాలానికి (బ్లాక్ పీరియడ్) ఒకసారి ఫీజులను నిర్ధారించి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తుంది. ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలకు కనిష్టంగా 40వేల రూపాయలు, గరిష్ఠంగా 1.17లక్షల రూపాయల ట్యూషన్ ఫీజులను కమిటీ ప్రతిపాదించింది.
మొత్తం ఫీజు చెల్లిస్తామని జగన్ గతంలో హామీ..! 35వేలు కట్టాలనడంతో విద్యార్థుల్లో అయోమయం..!!
కానీ ఈ విషయంలో సీఎం జగన్ ఆలోచన వేరుగా ఉంది. ఇంతకుముందు కనీస ఫీజు 35వేలు రూపాయలుగా నిర్ధారించినప్పుడు ఒక్కో కాలేజీకి ఒక్కో ఫీజు ఉండటాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అందుకే ఈ ఏడాదికి పాత ఫీజులే రీయింబర్స్ చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏ కాలేజీలో ఎంత ఫీజు నిర్ధారించినా కూడా గత ప్రభుత్వం కనిష్ఠ ఫీజు 35వేల రూపాయలు మాత్రమే రీయింబర్స్ చేస్తూ వచ్చింది. కానీ ఇంజనీరింగ్తో పాటు వృత్తివిద్య కాలేజీలన్నింటిలో మొత్తం ఫీజును ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు.
అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్..! కసరత్తు చేస్తున్నప్రభుత్వం..!!
ఇదే విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలోనూ పెట్టారు. ఇచ్చిన హామీ ప్రకారం నిబంధనల మేరకు అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని సూత్రపాయ్రంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈసారికి పాత ఫీజులు అమలుచేస్తూ పూర్తి ఫీజును రీయింబర్స్ చేయడం వల్ల ప్రభుత్వానికి 100కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడుతుందని ఓ అధికారి పేర్కొన్నారు. ఈనెల 8నుంచి ఇంజనీరింగ్ ఆప్షన్లు మొదలు కానుండటంతో వృత్తివిద్యా ఫీజుల అమలుపై ప్రభుత్వం నేడో, రేపో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.