మగాళ్ల దినోత్సవం రోజున బయటపడ్డ మగువ ఆకృత్యాలు..ఆమెకు బలైన అరడజను పురుషులు
Recommended Video
మన దేశంలో వివాహం అనే వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక పురుషుడు ఒక మహిళ వివాహం ద్వారా ఒక్కటయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పిల్లా పాపలతో వారి కాపురం చల్లగా ఉండాలని వివాహానికి అతిథులుగా వచ్చిన వారు ఆశీర్వదిస్తారు. కానీ కొందరు మహిళలు మాత్రం తాము కట్టించుకున్న తాళిని ఎగతాళి చేసి కాపురాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. కేవలం బంగారం, డబ్బు వ్యామోహంలో పడి కట్టుకున్న భర్తను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది.
ఆకాశమంత పందిరి.. ఘనంగా జరిగిన వివాహం
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు మౌనిక. ఈమె తండ్రి పేరు అనంత రెడ్డి. ప్రకాశం జిల్లా మోదినీ పురం గ్రామానికి చెందిన మౌనిక బట్టల మార్చినంత ఈజీగా భర్తలను మారుస్తూ చివరకు పోలీసులకు చిక్కింది. వివరాల్లోకెళితే... కడప జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో మూడు నెలల క్రితం మౌనికకు వివాహం జరిగింది. అమ్మాయి అందంగా ఉందని చెప్పి అత్తింటి వారు కట్నకానుకలు కూడా తీసుకోకుండా ఘనంగా వివాహం జరిపించారు. కాపురం సవ్యంగా సాగుతున్న క్రమంలో మౌనిక తండ్రి అనంతరెడ్డి వచ్చి తన కూతురును పుట్టింటికి తీసుకెళుతున్నట్లు చెప్పాడు. ఎన్ని రోజులు అయినప్పటికీ మౌనిక తిరిగి అత్తింటికి చేరుకోలేదు. కనీసం సమాచారం కూడా లేదు. ప్రకాశం జిల్లాలోని మౌనికా ఇంటికి వెళితే అక్కడ ఎవరూ లేరు. వారి బంధువులను వాకాబు చేస్తే తమకు తెలియదని చెప్పారు. దీంతో ఏమి చేయాలో తెలియక రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెళ్లి జరిగింది కడపలో... మరో వ్యక్తితో హైదరాబాదులో కాపురం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మౌనికా వాడుతున్న సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ముందుగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ లేకపోవడంతో విశాఖపట్నంకు వెళ్లారు. అక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరగా ఆమె హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి హైదరాబాద్కు చేరుకుని మౌనికను పట్టుకున్నారు. ఇక్కడ మరో యువకుడితో ఆమె కాపురం చేస్తోంది. పోలీసులు ఇది చూసి షాక్కు గురయ్యారు. వెంటనే ఆ యువకుడిని మౌనికను అదుపులోకి తీసుకుని కడపకు తరలించి విచారణ చేపడితే దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి.
ఆరుగురిని పెళ్లి చేసుకున్న నిత్యపెళ్లి కూతురు
ముందుగా ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న మౌనిక కొన్ని రోజులకే భర్తను వదిలేసి అదే జిల్లా పందిళ్లపల్లె గ్రామానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మూడో పెళ్లి గిద్దలూరుకు చెందిన వ్యక్తితో, నాలుగో పెళ్లి తెనాలికి చెందిన వ్యక్తితో చేసుకుంది. ఐదో పెళ్లి కడప జిల్లా వ్యక్తి రామకృష్ణారెడ్డిని చేసుకోవడం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. రామకృష్ఱారెడ్డిని కూడా వదిలేసిన తర్వాత హైదరాబాద్కు చెందిన యువకుడితో విజయవాడలో పరిచయం కాగా అతన్ని అన్నవరంలో పెళ్లిచేసుకుని మకాం హైదరాబాదుకు మార్చింది. ఇలా పెళ్లిళ్లు చేసుకున్న ఈ కిలేడి భర్తలతో ఒక నెలా లేదా కొన్నిరోజులు కాపురం చేసి అత్తింటి నుంచి బంగారం, డబ్బులతో పరారయ్యేది. అయితే ఇందులో తండ్రి అనంతరెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మౌనిక పై 420 కేసును నమోదు చేశారు పోలీసులు.