ఏపీ తీరప్రాంత ఉప్పు రైతులకు ఈ ఏడాది కష్టమే: కరోనా లాక్ డౌన్ తో తీరని నష్టమే !!
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ఏపీలో ఉప్పు రైతుల మీద దారుణంగా పడింది. తీర ప్రాంతాల్లో ఉప్పు సాగు చేసే రైతులు కరోనా లాక్ డౌన్ దెబ్బకు కుదేలవుతున్నారు. లాక్ డౌన్ తో ఉప్పు ఉత్పత్తి చెయ్యలేకపోవటం ఈ సారి వారికి నష్టాలను మిగిల్చింది. నరసాపురం మండలంలో, మొగల్తూరు మండలంలో ఉప్పు సాగు మీద సుమారు 2 వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కరోనా వైరస్ సంబంధిత లాక్ డౌన్ తో ఏపీ సముద్ర తీరప్రాంతంలో "ఉప్పు రైతులు" ఉప్పు సాగు చెయ్యలేకపోయారు. ఇప్పుడు సాగు మొదలు పెట్టినా అనుకున్నంత ఉప్పు ఉత్పత్తి సాధ్యం కాదని భావిస్తున్నారు.
ఉప్పు పంటనే జీవనాధారం చేసుకున్న సుమారు 2 వేల కుటుంబాలు
నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఇక తీర ప్రాంత గ్రామాల్లో వేల సంఖ్యలో ప్రజలు ఉప్పు సాగు చేస్తున్నారు. తీరప్రాంత గ్రామాలైన నరసాపురం మండలంలోని 1500 ఎకరాల్లో ఉప్పు సాగు జరుగుతుంది. ఇక మొగల్తూరు మండలంలో ఒకప్పుడు రెండు వేల ఎకరాల్లో సాగు చేసేవారు. క్రమంగా అక్కడ ఉప్పు సాగు తగ్గి 40 ఎకరాలలో ప్రస్తుతం సాగు జరుగుతుంది. సుమారు 2 వేల కుటుంబాలు ఉప్పు పంటనే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నారు.
గిట్టుబాటు ధర రాక ఉప్పు రైతుల విలవిల
ఉప్పు సాగు చాలా కష్టంతో కూడుకున్న పని కావటంతో చాలా మంది ఆసక్తి చూపించటం లేదు . మండే ఎండలో శ్రమిస్తేనే ఫలితం వచ్చేది. ఉప్పు సాగు చెయ్యటం ఏం అంత ఈజీ కాదు. చిన్న చిన్న మడులు కట్టి ఉప్పు సాగు చేస్తారు. ఒక్కో ఎకరంలో 60 నుంచి 70 మడులు కడతారు. ఇక ఆ మడుల్లో ముందుగా మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారు కాదు. ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. రైతుకు మాత్రం అమ్మేటప్పుడు గిట్టుబాటు కాక నష్టపోతున్నారు.
ఉప్పు సాగు మానేసి వనామీ రొయ్యల సాగు చేస్తున్న చాలా మంది రైతులు
కరోనా లాక్ డౌన్ ప్రభావంతో స్టాక్ ఉంచుకునే వెసులుబాటు లేక , కార్మిక కొరత, రవాణా లేకపోవడం మరియు అంతర్-జిల్లా ప్రయాణ పరిమితులు అన్నీ వెరసి ఉప్పు ఉత్పత్తి చెయ్యలేని పరిస్థితి ఉప్పు రైతులకు కలిగింది. అసలే ఉప్పు రైతులు ఎండాకాలం చెమటోడ్చి కష్టించినా ఉప్పు సాగు లాభసాటిగా లేదు. దీంతో చాలా మంది ఉప్పు సాగు మానేసి వనామీ రొయ్యల సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కొంత మంది మాత్రమే ఉప్పు సాగు మీద ఆధారపడి పని చేస్తున్నారు. ఇంతా కష్టపడితే మిగిలేది మాత్రం పెద్దగా లేకపోవటంతో చాలా మంది ఉప్పు పంట సాగుకు ఆసక్తి చూపించటం లేదు.
Recommended Video
కరోనా దెబ్బతో ఉప్పు రైతుకు కష్టం .. ఈ సీజన్ నష్టం
ఇక అసలే మూలుగుతున్న ఉప్పు సాగు మీద కరోనా దెబ్బ కొట్టింది. కరోనా కారణంగా ఈ ఏడాది ఉప్పుసాగు ఆలస్యమైంది. మార్చి, ఏప్రిల్ నెలల నుండి జూన్ వరకు సీజన్ .. అయితే మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా లాక్ డౌన్ కొనసాగటంతో ఉప్పు రైతులు దీనివల్ల సగం సీజన్ నష్టం పోయారు. ఇప్పటి నుంచైనా ఎండలు ఎక్కువగా ఉంటే సాగు సజావుగా సాగితేనే పంట పండుతుంది. లేదంటే మళ్ళీ కష్టమే అంటున్నారు .