బొబ్బలెక్కిన కాళ్లు.. ముల్లు దిగినా లెక్క చేయకుండా!: పాదయాత్రలో దూసుకెళ్తున్న జగన్..
కర్నూలు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సీటే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆటంకాలను లెక్క చేయకుండా సంకల్పంతో పాదయాత్రను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.
22రోజులుగా పాదయాత్ర చేస్తున్న జగన్ వ్యక్తిగత ఇబ్బందులను అసలు లెక్క చేయడం లేదు. కాళ్లు బొబ్బలెక్కి బాధపెడుతున్నా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఒక కాలిలో ముల్లు కూడా గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. నిర్విరామంగా నడుస్తుండటం వల్లే జగన్ కాళ్లు బొబ్బలెక్కినట్లు సమాచారం.
22వ రోజు కారుమంచిలో :
ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సాగుతోన్న జగన్ పాదయాత్ర 22వ రోజున ఆలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కారుమంచి గ్రామం నుంచి జగన్ పాదయాత్ర మొదలవగానే గ్రామ మహిళలంతా కదలివచ్చారు. జగన్ తో తమ సమస్యలను చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన హామిలను నిలబెట్టుకోలేకపోయారని ఈ సందర్భంగా వారు వాపోయినట్లు తెలుస్తోంది.
చదువుల విప్లవం తెస్తా:
కారుమంచి గ్రామ ప్రజల సమస్యలపై జగన్ స్పందించారు. మహానేత వైఎస్ హయాం నాటి చదువుల విప్లవాన్ని మళ్లీ తీసుకొస్తామన్నారు. కాలేజీల్లో ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుందని హామి ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.1వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతామన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు.
పేరు పెట్టిన జగన్:
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మిథిలారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తన కుమార్తెకు నామకరణం చేయాలని కోరారు. దీంతో ఆ చిన్నారికి 'రేయన్ష' అని జగన్ నామకరణం చేశారు. చిన్నారిని ముద్దాడి సంతోషం వ్యక్తం చేశారు.
పొలంలో వైఎస్ విగ్రహం:
కారుమంచి గ్రామ రైతు గొల్ల రామన్న వైఎస్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. తన పొలంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా జగన్ ను కోరడంతో.. ఆయన పొలం వద్దకు వెళ్లారు. చిన్నారితో విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి పూలమాలలు వేశారు. వైఎస్ హయాంలో తన కుటుంబానికి ఒకేసారి రూ.1లక్ష రుణమాఫీ జరిగిందని ఈ సందర్భంగా రామన్న గుర్తుచేసుకున్నారు. విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయించినట్లు తెలిపారు.