coronavirus: ఢిల్లీ వెళ్లొచ్చిన వారు ముందుకురండి, లేదంటే చర్యలు తప్పవు: సీఎం జగన్
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంపై కూడా అధికారులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్షించారు. ఢిల్లీ వెళ్లొచ్చినవారితో కలిసినవాళ్లు వైద్య పరీక్షలకు ముందుకురావాలని సీఎం జగన్ కోరారు. అర్భన్ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలపై కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేసిన ఇంటింటీ సర్వేపై ఆరాతీశారు. ఆక్వా రంగం, అనుబంధ రంగాల పరిస్థితి గురించి అధికారులు ఎక్స్ప్లేన్ చేశారు.
ఇబ్బంది కలిగించొద్దు..
రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అరటి, టమోటా రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిల్వ చేయలేని పంటల విషయంలో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని అధికారులకు స్పష్టంచేశారు.
జనతా మార్కెట్లు..
రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో జనతా మార్కెట్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ స్పష్టంచేశారు. డిమాండ్కు తగినవిధంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలవారీగా మార్కెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. లాక్ డౌన్ సమయంలో అన్ని దుకాణాల వద్ద పండ్లు విక్రయించే రైతులకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో రిటైల్ వ్యాపారం పెరుగుతుందని.. రైతులకు కూడా మేలు జరుగుతుందని తెలిపారు. అధికారులు వివరించిన విధానం బాగుందని సీఎం జగన్ అంగీకరించారు. కానీ శాశ్వత పరిష్కారాలపై దృష్టిసారించాలని కోరారు.
అధ్యయనం చేసి..
ప్రధానంగా పంటకు సంబంధించి సరైన డిస్ట్రిబ్యూన్ నెట్ వర్క్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ సూచించారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలు ఏ విధమైన వైఖరి అవలంభిస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా విధానాలు పరిశీలించి.. సరైన విధానం రూపొందించాలని అధికారులకు స్పష్టంచేశారు. మేలైన విధానాన్ని రాష్ట్రంలో అవలంభించాలని.. అందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.