ఆ ముగ్గురే కీలకంగా: విలీనమా? పొత్తా?.. జగన్-బీజేపీ మధ్య లోగుట్టు ఇదే!
కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి రాయబారంతో ఆ ముగ్గురు జగన్కు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
న్యూఢిల్లీ/విజయవాడ: అంతా అనుకున్నట్లే జరిగితే మరికొద్ది రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీకి బీజేపీ దూరం జరుగుతున్న వేళ.. జగన్తో దోస్తీకి ఆ పార్టీ స్నేహ హస్తం అందించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఎన్డీయేలోకి జగన్, మధ్యవర్తిగా 'గాలి': 'రిపబ్లిక్' ఏం చెప్పిందంటే?
అంతర్గతంగా ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే కసరత్తులు కూడా మొదలైపోయాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో చేతులు కలిపేందుకు జగన్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారని, ఇందుకోసం ముగ్గురు కీలక నేతలు ఆయనకు సహాయ సహకారాలు అందించారన్న ప్రచారం జరుగుతోంది.
విస్తరణ కాంక్ష:
చాలాకాలంగా దక్షిణాదిన పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగుతోంది. నయానో భయానో ప్రాంతీయ పార్టీలను దారికి తెచ్చుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే తమిళ రాజకీయ అనిశ్చితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు బీజేపీ చేస్తూనే ఉంది.
ఇటు ఏపీలోను పార్టీని విస్తరింపజేయాలన్న కాంక్ష చాలాకాలంగా బీజేపీలో అలాగే ఉండిపోయింది. ఒకరకంగా వెంకయ్య-చంద్రబాబుల దోస్తీ తమ ఆకాంక్షకు అవరోధంగా మారిందన్న భావనతోనే ఉపరాష్ట్రపతి పదవిలో వెంకయ్యనాయుడిని ఇరికేంచేశారన్న ప్రచారం కూడా ఉంది.
ఇప్పుడెలాగు బీజేపీకి రూట్ క్లియర్ అయింది కాబట్టి.. పార్టీని వేగంగా జనంలోకి తీసుకెళ్లడంపై ఆ పార్టీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో టీడీపీతో చెలిమికి చరమగీతం పాడి.. జగన్తో దోస్తీ కట్టాలనే కొత్త వ్యూహాన్ని ఎంచుకుంది.
Recommended Video
బీజేపీతో వైసీపీ విలీనమా?:
జగన్ పై ఉన్న అవినీతి మరకల దృష్ట్యా ఆయనైతే పార్టీకి విధేయుడిగా ఉంటాడని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే విలీన ప్రతిపాదన తెచ్చి జగన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్డీయేలో జగన్ చేరుతున్నారంటూ రిపబ్లిక్ టీవీ కథనాన్ని ప్రసారం చేయడం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయన్న వాదనకు బలం చేకూర్చింది. అయితే విలీనమా? పొత్తా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదని ఇరు వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
గాలి డీల్, ఆ ముగ్గురి అపాయింట్మెంట్:
మూడేళ్లుగా బీజేపీ దూరం పెడుతూ వస్తున్నా.. ఇటీవల అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీకి జగన్ దగ్గరగా జరిగారు. అయితే దీని వెనకాల ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారన్న ప్రచారం జరుగుతోంది.
కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్థన్ రెడ్డి చొరవతో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, కేంద్రమంత్రి అనంతకుమార్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి చక్కబెట్టినట్లుగా చెబతున్నారు.
కేంద్ర స్థాయిలో తనకున్న పరిచయాలతో గాలి జనార్థన్ రెడ్డి జగన్తో బీజేపీ డీల్ సెట్ చేసినట్లు చెబుతున్నారు. బీజేపీ హైమాండ్ లోని ముగ్గురు నేతలతో జగన్ను టచ్ లోకి తీసుకెళ్లి.. వారి వద్ద స్నేహ హస్తానికి ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. జగన్తో బీజేపీ చేతులు కలిపేందుకు ఈ ముగ్గురూ సానుకూలంగా స్పందించడంతో.. ఇక వీరి కలయిక లాంఛనమే అన్న ప్రచారం కూడా అప్పుడే మొదలైపోయింది.
సుష్మా స్వరాజ్ సహాయంతో:
మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డికి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ పొలిటికల్ గాడ్ ఫాదర్ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఒకప్పుడు సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీకి దిగిన సమయంలో.. సుష్మా స్వరాజ్ ఆమెపై పోటీ చేశారు. ఆ సందర్భంలో సుష్మా ఎన్నికల ఖర్చంతా గాలి బ్రదర్సే భరించారని చెబుతారు.
గాలి సోదరులు చూపించిన ఈ విధేయతకు సుష్మా వారి పట్ల కృతజ్ఞతను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ గురించి గాలి ప్రస్తావించగానే సుష్మా స్వరాజ్ అతనికి అపాయింట్ మెంట్ ఖరారు చేశారని తెలుస్తోంది. అపాయింట్ మెంట్ మాత్రమే కాదు.. బీజేపీతో చేతులు కలిపేందుకు జగన్ కు ఆహ్వానం పలికారని కూడా చెబుతున్నారు.
కేంద్రమంత్రి అనంతకుమార్ చొరవ:
సుష్మా స్వరాజ్ నుంచి సానుకూల స్పందన రాగానే జగన్ను వెంటనే కేంద్రమంత్రి అనంతకుమార్ వద్దకు గాలి పంపించినట్లు చెబుతున్నారు. గాలికి సన్నిహితుడుగా పేరున్న అనంతకుమార్.. బీజేపీతో చేరేందుకు జగన్కు సహకరించే విషయమై ఆలోచిస్తున్నారట. గాలి తీసుకొచ్చిన విజ్ఞప్తి కావడంతో దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి పరిశీలిస్తున్నారట. మొత్తం మీద జగన్ ను బీజేపీకి దగ్గర చేసేందుకు ఆయన నుంచి కూడా భరోసా వచ్చినట్లు చెబుతున్నారు.
మూడో వ్యక్తి అమిత్ షా:
జగన్-బీజేపీ కలయిక కోసం అందరి కన్నా ఆత్రుతగా ఎదురు చేస్తున్న వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే అన్న వాదన ఉంది. జగన్ కు ఎలాగూ కేసుల భయం ఉంది కాబట్టి, దాన్ని అస్త్రంగా మార్చుకుని ఆయన్ను తమలో కలుపుకోవడమో.. లేక పొత్తు పెట్టుకోవడమో చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువ మేర విలీనానికే అమిత్ షా మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ కూడా అందుకు సుముఖంగా ఉన్నాడు కాబట్టే మోడీతో ఆయనకు అపాయింట్ మెంట్ సెట్ చేశారన్న వాదన వినిపిస్తోంది.
మొత్తానికి ఏపీలో విస్తరించడానికి చంద్రబాబు కన్నా జగన్ తో మిత్రుత్వమే బెటర్ అని బీజేపీ ఫిక్స్ అయిపోయినట్లుగా చెప్పవచ్చు. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా సమీకరణాలు మారిపోతాయి. అయితే టీడీపీతో పొత్తుతో ఏపీలో అధికారాన్ని పంచుకున్న బీజేపీ.. రాబోయే రోజుల్లో వైసీపీతో కలిసి ఎలాంటి ఫలితాలు రాబడుతుందో వేచి చూడాలి!