భయపెడుతున్న ఆ మూడు పదవులు..! వద్దు బాబోయ్ అంటున్న వైసీపి ఎమ్మెల్యేలు...!!
అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. జీవితంలో ఒక్కసారి 'ఎమ్మెల్యే' అనిపించుకుంటే చాలు జీవితం ధన్యం సుమతీ అనుకునే వాళ్లు రాజకీయాల్లో చాలా మంది ఉంటారు. ఎమ్మెల్యే ఐన వాళ్లు మాత్రం మంత్రి పదవులు తీసుకోవడానికి సెంటిమెంట్ అంశాన్ని కారణంగా చూపి తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వింత సంఘటన ఏపి రాజకీయాల్లో చోటుచేసుకుంటోంది. దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపి నేతలకు పార్టీ గెలిచిన తరువాత పదవులు తీసుకునేందుకు వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ మూడు పదవులు తమకు వద్దు బాబోయ్ అంటూ అదిష్టానానికి మొరపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. వైసీపి ఎమ్మెల్యేలను అంతటి భయ భ్రాంతులకు గురి చేస్తున్న ఆ మూడు పదవులు ఏంటి..? ఎందుకు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
వైసీపి ఎమ్మెల్యేలకు పదవుల సెంటిమెంట్..! ఆమూడు పదవులపై పెదవి విరుపు..!!
పిలిచి పిల్లనిస్తామంటుంటే ఏదో లేదని పెళ్లికొడుకు వెళ్లి పోయినట్టు ఉంది వైసీపి ఎమ్మెల్యేల పరిస్థితి. నిన్నటి వరకూ వైసీపీ నేతల్లో గెలుపుపై ఆందోళన. ఇప్పుడు మంత్రిపదవులపై గుబులు. సుధీర్గ కాలం తర్వాత తొలిసారి పవర్లోకి వచ్చిన తమ పార్టీలో మంచి పదవి కావాలని ఆశపడుతున్న వారి జాబితా చాంతాడంత ఉన్నట్టు తెలుస్తోంది. 154 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 100 మంది వరకూ తమ పేరు కేబినెట్లో ఖాయమనే ఊహాల్లో విహరిస్తున్నారట. దీనికి వైఎస్ అనుచరులుగా తమ పేరు.. టీడీపీ దిగ్గజ నేతలపై గెలుపు.. ఇలా ఎవరి కారణాలు వారు చూసుకుని లెక్కలు వేస్తున్నారట.
మాకొద్దు బాబోయ్ ఆపదవులు..! పరుగులు తీస్తున్న ఎమ్మెల్యేలు..!!
అంతవరకూ బాగానే ఉంది. కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ దానిలో ఉప కులాలు ఇలా వంతుల వారీగా నేతల సంబరం మరో మూడ్రోజులు అంటున్నారట. దీనిపై లోలోపల వైసీపీ నేతలు సెటైర్లు కూడా వేసుకుంటున్నారట. అయితే మరికొందరు ఎమ్మెల్యే, ఎంపీలు తమ పేర్లు పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నారంటూ మీడియాలో హడావుడి చేయిస్తున్నారూ ఉన్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. పదవి దక్కినా. దక్కకపోయినా.. ఆ మూడు పదవులు మాత్రం తమకు వద్దంటున్నారట.
ఎందుకంత వ్యతిరేకత..! సర్దుకుపోవాలంటున్న అదిష్టానం..!!
ఆ జాబితాలో మొదటిది స్పీకర్ పదవి కావటం విశేషం. రెండోది దేవదాయశాఖ, మూడోది ఎక్సైజ్. కాసులు కురిపించే అబ్కారీ కూడా వద్దంటున్నారంటే సెంటిమెంట్ భయం ఎంతగా వెంటాడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు శాఖలు చేపట్టిన నేతలు క్రమంగా రాజకీయాల నుంచి తెరమరుగు అయ్యారు. మొన్న తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, నిన్న ఏపీలో కోడెల శివప్రసాద్ ఇద్దరూ ఘోరంగా పరాజయం పొందారు.
పదవి కావాలని ఒత్తిడి తెస్తున్న నేతలు..! శాఖ పేరు చెప్పగాపే నీరుగారి పోతున్న నేతలు..!!
తమ కొడుకుల పుణ్యమాంటూ హుందాగా రాజకీయాల నుంచి వైదొలగాల్సిన ఆ ఇద్దరూ భారంగా బయటకు వెళ్లారు. అబ్కారీ శాఖను స్వీకరించిన తెలంగాణలో పద్మారావుగౌడ్, ఏపిలో జవహర్ ఇద్దరూ అవమానం చవిచూశారు. దేవాదాయశాఖ విషయంలోనూ ఇదే జరిగింది.. జరుగుతుందనే భయం వెంటాడుతుంది. అందుకే.. జగన్ తమకు పదవి కట్టబెట్టినా కట్టబెట్టకపోయినా.. ఆ మూడు వద్దుబాబోయ్ అనుకుంటున్నారట. అయితే.. స్పీకర్గా రోజా, అంబటి, సుచరిత పేర్లు వినిపిస్తున్నాయి. కాదంటే.. ఎవరైనా అనుభవం, మాటకారి తనం ఉన్న వారికి ఇవ్వాలనుకుంటున్నారట. మద్యం ఎలాగూ రద్దు చేస్తారు కాబట్టి.. ఆ శాఖ ఇచ్చినా వచ్చే లాభం ఏమిటనేది నేతల ధర్మ సందేహం. మరి ఈ లెక్కన జగన్ తనకు ఇష్టంలేని.. పొమ్మనలేక పొగ పెట్టేందుకు ఆ మూడింట్లో ఏదొఒకటి ఇవ్వవచ్చంటూ మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. మరి ఈ భయం ఎవర్ని పదవికి చేరువ చేస్తుందో.. ఎవర్ని దూరం చేస్తుందో చూడాలి..!