2019 లో కూడా కీలకం కానున్న ఉభయ గోదావరి జిల్లాలు..
Recommended Video
రాబోవు ఎన్నికల్లో ఆంద్ర ప్రదేశ్ రాజకీయాలను కీలక మలుపు తిప్పబోతున్నాయి ఉభయగోదావరి జిల్లాలు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దత్తు తెలిపిన రెండు జిల్లాల ప్రజలు ఇప్పుడు కాస్త వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా, నేతల కుమ్ములాటలు, జనసేన అంశాలు ఈ రెండు జిల్లాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీని ఈ రెండు జిల్లాల ప్రజలు అంతగా ఆదరిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఏపి రాజకీయ భవిష్యత్తును నిర్ధారించేవి ఈ రెండు జిల్లాలే...
గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారిదే అధికారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అదే ట్రెండ్. ఇప్పుడూ అదే కొనసాగుతుంది. గత ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలోని 14 సీట్లలో 14 సీట్లు దక్కించుకుంది. అప్పటి మిత్రపక్షం బిజెపితో కలుపుకుని. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యేట్లు కనపడుతోంది. ఈ సారి 14సీట్లు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార టీడీపీ ఆరు నుంచి ఎనిమిది సీట్లు గెలుచుకొంటే గొప్పేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా వ్యవసాయాధార ప్రాంతం. గత ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ హామీని పూర్తిగా అమలు చేయటంలో విఫలమయ్యారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాదరణ కోల్పోయిన టీడిపి..
ఎన్నికలకు ముందు రుణమాఫీ పేరు చెప్పి అవసరం లేని వారితో కూడా కొన్ని చోట్ల టీడీపీ నేతలు రుణాలు తీసుకునేలా చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు చేసిన చర్యలతో రైతాంగం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. పైకి అంతా ప్రశాంతంగా ఉన్నా..ఎన్నికల సమయంలో వారు తమ కసి తీర్చుకోవటం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు డ్వాక్రా రుణాల మాఫీ విషయంలోనూ అదే తీరు. ఓ వైపు హామీల అమలు విషయంలో మోసం ఒకెత్తు అయితే...స్థానిక నాయకుల దందాలు..అరాచకాలు టీడీపీకి తీరని నష్టం చేయటం ఖాయం అని చెబుతున్నారు. దీనికి తోడు నిడదవోలు, కొవ్వూరు, ఆచంట, పోలవరం నియోజకవర్గాల్లో సాగుతున్న అడ్డగోలు ఇసుక దోపిడీ టీడీపీపై వ్యతిరేకతను పీక్ కు చేర్చింది.
టీడిపి చరిష్మాను తగ్గించిన అంతర్గత కుమ్ములాటలు...
గతంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, మంత్రులు అయినా రాష్ట్ర స్థాయిలో ఏదైనా పనులు చేసి సంపాదించుకునే వారని..ఇంతలా జిల్లా, నియోజకవర్గాల్లో దోపిడీ ఎన్నడూలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గెలుపు గ్యారంటీ జాబితాలో ఉండి, గోపాలపురం, దెందులూరు, తణుకు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇద్దరు మంత్రులు పితాని, జవహర్ కూడా ఎదురుగాలి తప్పదని..ఓ సర్వేలో తేలింది. ప్రస్తుత మంత్రులతోపాటు మాజీ మంత్రులు ఓటమి గండం తప్పేలాలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈస్టు, వెస్టు లో జనసేన ప్రభావం చూపే అవకాశాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నాలుగేళ్ల పాటు వదిలేసి...ఇఫ్పుడు కొత్తగా చంద్రబాబు అందుకున్న ‘ప్రత్యేక హోదా' నినాదం పశ్చిమ గోదావరి జిల్లాపై ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం కూడా కన్పించటం లేదు. ఈ జిల్లాలో చంద్రబాబు సాగిస్తున్న మోడీ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక ప్రచారం ప్రభావం నామమాత్రంగా కూడా ఉండదని తేలింది.