బాబుకు తలనొప్పి, ఆ టిక్కెట్ ఇవ్వకుంటే తోట గుడ్బై?: వైసీపీలోకి వెళ్లినా ఫలితం ఉండదా?
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా తాను ఎన్నికల బరిలోకి దిగడం లేదని కాకినాడ ఎంపీ తోట నర్సింహం చెప్పారు. కానీ తన భార్య వాణికి మాత్రం టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
రాజకీయాలపై ఆసక్తి లేదు, కానీ: జగన్ను ఎందుకు కలిశానో చెప్పిన నాగార్జున
తన భార్యకు టిక్కెట్ అడుగుతున్న తోట నరసింహం
ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేశారు. తన భార్య వాణికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారట. కానీ ఈ స్థానాన్ని ఇప్పటికే జ్యోతుల నెహ్రూకు ఖరారు చేశారట. నెహ్రూ 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీలో చేరారు. ఇది తెలిసి కూడా టిక్కెట్ అడగడం సరికాదని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
జ్యోతుల నెహ్రూకు హామీ
జగ్గంపేట నియోజకవర్గాన్ని జ్యోతుల నెహ్రూకు కేటాయించారని తెలిసి కూడా అడుగుతున్నారంటే తోట నర్సింహం ఏదో రాజకీయ వ్యూహంతో ఉన్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన వైసీపీలోకి వెళ్లే ఉద్దేశ్యంతోనే దీనిని అడుగుతున్నారని భావిస్తున్నారు. తోట నర్సింహం 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
వైసీపీలోకి వెళ్లినా నో టిక్కెట్!
2019లో తోట నర్సింహంకు టిక్కెట్ లభించే పరిస్థితి లేదని అంటున్నారు. ఇటీవల చలమశెట్టి సునీల్ టీడీపీలో చేరారు. ఆయనకు కాకినాడ లోకసభ టిక్కెట్ ఇవ్వనున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యకు టిక్కెట్ కావాలని తోట నర్సింహం పట్టుబడుతున్నారట. లేదంటే పార్టీ వీడేందుకు కూడా సిద్ధమని చెబుతున్నారట. అయితే తోట నర్సింహం టీడీపీని వీడి వైసీపీలో చేరినా జగ్గంపేట టిక్కెట్ వస్తుందనే ఆశ లేదని అంటున్నారు. అక్కడి నుంచి జ్యోతుల చంటిబాబు ఇప్పటికే వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు. జగన్ ఆయనకు టిక్కెట్ కూడా ఖరారు చేశారని చెబుతున్నారు.