ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష: తోట మధ్యవర్తిత్వం ఫలిస్తుందా?
తుని: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమం చల్లారుతుందా? లేక శుక్రవారం నుంచి మరింతగా రగులుతుందా? అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గత ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో నిర్వహించిన ‘కాపు ఐక్య గర్జన' ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరాహార దీక్షను ముద్రగడ పద్మనాభం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గురువారం సాయంత్రంలోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే శుక్రవారం ఉదయం 9 గంటలకు తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని అల్టిమేటం జారీ చేశారు.
ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. ముద్రగడ సొంతూరు కిర్లంపూడిలో భారీ ఎత్తున పోలీసులు మెహరించారు. మరోవైపు సీఎం చంద్రబాబు బుధవారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.
అయితే కాపులకు రిజర్వేషన్ కల్పించడంలో కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. అయితే ఈలోపే ముద్రగడ పద్మనాభాన్ని చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షను విరమించే బాధ్యతను టీడీపీ ఎంపీ తోట్ త్రిమూర్తులకు అప్పగించినట్లు సమాచారం.
ముద్రగడ సొంత జిల్లా తూర్పుగోదావరిలోని రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులకు కాపుల్లో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రంగంలోకి దిగిన తోట, ముద్రగడ దీక్ష కార్యరూపం దాల్చకుండా మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.