చంద్రబాబుకు తోట త్రిమూర్తులు షాక్: తెలంగాణ తలసానితో భేటీ, వైసీపీలోకి?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత తోట త్రిమూర్తులు బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాదులోని తలసాని ఇంటికి తోట వెళ్లి మరీ సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది. తెలంగాణ మంత్రిని ఆయన కలవడంపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
తోట త్రిమూర్తులు వైసీపీలో చేరుతారని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. అంతకుముందు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడానికి ముందు త్రిమూర్తులును కలిశారు. ఇప్పుడు తోట.. తలసానిని కలిశారు.
తలసానిని కలిసిన అనంతరం తోట త్రిమూర్తులు మాట్లాడుతూ... తలసాని తనకు సన్నిహితుడు అని చెప్పారు. మంత్రిగా అయినందుకు అభినందించేందుకు మాత్రమే వచ్చానని చెప్పారు. తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చలు జరగలేదని చెప్పారు.
తోట త్రిమూర్తులుతో భేటీపై తలసాని మాట్లాడుతూ... ఏపీలో తన పర్యటన కొనసాగుతాయని, తాను పర్యటిస్తుంటే చంద్రబాబుకు భయమెందుకని నిలదీశారు. తనకు అక్కడ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారని చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రచారం చేసి తనను ఓడించేందుకు కుట్రలు చేసిన చంద్రబాబుపై కచ్చితంగా ప్రతీకారం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ లోటస్ పాండుకు వెళ్లి జగన్ను కలిశారు. వైసీపీని థర్డ్ ఫ్రంట్లోకి ఆహ్వానించారు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే జగన్, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్కు మద్దతివ్వాలని కేసీఆర్ ఏపీ ఓటర్లకు పిలుపునిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తోట.. తలసానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీలోకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.