తోటపల్లి పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
విజయనగరం: కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తోటపల్లి పుణ్యక్షేత్రంకు సరికొత్త వైభవంను తీసుకొస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. చిన్న తిరుపతిగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులను రెండు దశల్లో పూర్తి చేస్తామన్నారు. ఆలయ పనులు తమ చేతులు మీదుగా ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంతకీ తోటపల్లి పుణ్యక్షేత్రం అంత పాపులారిటీ దక్కించుకోవడానికి కారణమేంటి..? చిన్న తిరుపతిగా ఎందుకు పిలువబడుతోంది..?
భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు!: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శలు
తోటపల్లి పుణ్యక్షేత్రం
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ప్రసిద్ధి గాంచిన తోటపల్లి పుణ్యక్షేత్రంకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. తన భర్త అరకు పార్లమెంటరీ వైసీపీ ఇంఛార్జ్ శతృచర్ల పరీక్షిత్ రాజుతో కలిసి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం రూ.5.5 కోట్లతో ఆలయ సముదాయ పనులను ప్రారంభించారు. మొదటి దశలో గర్భాలయం అర్థమండపం శ్రీదేవి భూదేవి ఉపాలయాలు, ముఖమండపం, శ్రీకోదండరామస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులను రూ.1.20 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులు విడుదలైనట్లు శ్రీవాణి చెప్పారు.
రెండు దశల్లో అభివృద్ధి పనులు
రెండో దశలో భాగంగా రూ. 50 లక్షలతో ఐదు అంతస్తుల రాజగోపురం, రూ. 80 లక్షలతో ప్రాకార మండపం, రూ.30 లక్షలతో కాలక్షేప మండపం, రూ. 15 లక్షలతో ముఖ మండపం నిర్మించనున్నట్లు చెప్పారు. ఇక ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ఒక సముదాయం కూడా నిర్మిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం... రూ. 30 లక్షలతో కళ్యాణ కట్ట, అన్నప్రసాద మండపంలను కూడా నిర్మిస్తామని చెప్పారు. రెండో దశ పనులకు మొత్తం రూ. 4.30 కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చెప్పారు.
ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ధి
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర తిరపతిగా తోటపల్లి పుణ్యక్షేత్రానికి పేరుంది. ఒడిషా నుంచి కూడా భక్తులు ఈ ఆలయంకు వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురైందనే చెప్పాలి. ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ హయాంలో పలువురు మంత్రులుగా పనిచేసినా ఆలయ అభివృద్ధిని ఏనాడు పట్టించుకోలేదనే విమర్శలు వినిపించాయి. ఇక అరకు ఎంపీగా పనిచేసిన కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కూడా ఆలయ అభివృద్ధిని గాలికొదిలేశారని అక్కడి స్థానిక ప్రజలు చెబుతుండటం విశేషం. ఇక ఉత్తరాంధ్ర తిరుపతి అయిన తోటపల్లి పుణ్యక్షేత్రాన్ని తిరిగి నిర్మించాలన్న ఆలోచనతో ముందుకొచ్చిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి దంపతులకుకృతజ్ఞతలు తెలిపారు కురుపాం నియోజకవర్గం ప్రజలు.
అభివృద్ధి దిశగా కురుపాం నియోజకవర్గం..
స్వతహాగా సీఎం జగన్కు అత్యంత దగ్గరగా ఉన్న వారిలో పుష్పశ్రీవాణి దంపతులు కూడా ఉన్నారనే టాక్ వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంటుంది. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కురుపాంకు ఇంజినీరింగ్ కళాశాల శాంక్షన్ చేయించుకున్నారు. సీఎం జగన్ ముందు ఈ ప్రతిపాదన పెట్టగానే ఆయన వెంటనే అంగీకరించారు. అంతేకాదు కొద్ది రోజుల క్రితమే ఇంజినీరింగ్ కళాశాలకు కావాల్సిన స్థలంను కూడా మంత్రి ఆళ్లనాని పరిశీలించారు. ఇక కేబినెట్లో ఆమోద ముద్ర వేస్తే ఈ కళాశాల పనులు పట్టాలు ఎక్కనున్నాయి.