మాచర్ల దాడి: కిశోర్ సహా ముగ్గురి అరెస్ట్, టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు
అమరావతి: గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నపై జరిగిన దాడి ఘటనలో బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దాడి ఘటనలో నిందితులైన తురక కిశోర్, గోపి, నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Recommended Video
టీడీపీ నేతలే బాధ్యతా రహితంగా..
ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత టీడీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. పల్నాడు అత్యంత సున్నితమైన ప్రాంతమని తెలిసినా.. టీడీపీ నాయకులు పలు వాహనాల్లో వచ్చి పర్యటించారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో సున్నితమైన ప్రాంతాలకు నాయకులు వెళ్లే ముందు పోలీసులకు కనీస సమాచారం ఇవ్వాలని సూచించారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ఎన్నికలను ఆపేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం లేకుండా, డబ్బు పంచకుండా విభిన్నమైన ఎన్నికలు రాష్ట్రంలో జరగబోతున్నాయని మంత్రి చెప్పారు.
రాక్షసత్వం పరాకాష్టకు..
రాష్ట్రంలో వైసీపీ నేతల రాక్షసత్వం, ఫ్యాక్షన్ మనస్తత్వం పరాకాష్టకు చేరిందని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమామమేశ్వరరావు, బుద్దా వెంకన్నపై వైసీపీ మాచర్ల పట్టణ అధ్యక్షుడు తురకా కిశోర్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీకి ఓటమి తప్పదన్న విషయం జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ వచ్చేసింది. అందుకే ఆ భయం, అసహనంతో టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను కూడా తమ కనుసన్నల్లో జరపాలనేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
రాష్ట్రంలో బతికేది ఎలా?
న్యాయ పరిశీలన కోసం వెళ్లిన మాజీ ఎమ్మెల్యేపై, ఎమ్మెల్సీపై రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేస్తారా.? ఇదేనా రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, సామాన్యులకు కల్పిస్తున్న భద్రత? పోలీసుల రక్షణలో ఉన్న వ్యక్తులపై కూడా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారంటే.. ఇక రాష్ట్రంలో బతికేదెలా.? అని సామాన్యులు భయాందోళనలు చెందుతున్నారు. ఈ దాడుల వెనుక జగన్మోహన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హస్తం ఉంది. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా. కానీ ఇంత వరకు ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్ని ఎక్కడా చూడలేదు. ఇలాంటి అకృత్యాలు, అరాచకాలు ఎన్నడూ ఎరుగను. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చేసిన ప్రమాణస్వీకారాన్ని తొమ్మిది నెలల్లోనే తుంగలో తొక్కారు. మాచర్లలో ఎన్నికలను ఎన్నికల సంఘం రద్దు చేయాలి. స్వేచ్ఛాయుతంగా నామినేషన్లు వేసే వాతావరణం కల్పించాలి. దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.