రైల్వే పరీక్షల లీకేజ్లో అరెస్ట్: ఇందులోను రిజర్వేషన్...
హైదరాబాద్: రైల్వే పరీక్షల లీకేజ్కు సంబంధించి కీలక నిందితులను పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. లీకేజ్కు పాల్పడిన కీలక నిందితులు మచ్చేందర్, రాజశేఖర్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితులను కర్నాటకలో అరెస్టు చేశారు.
రాజశేఖర్తో కలిసి మచ్చేందర్ ఎలక్ట్రానిక్ డివైజ్ తయారు చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడు మచ్చేందర్ 2008, 2010లలో హైటెక్ కాపీయింగ్కు పాల్పడినట్లు తెలిపారు. వారి వద్ద నుండి స్పై కెమెరాలు, 400 ఎలక్ట్రానిక్ వస్తువులు, పిన్ కెమెరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఆర్ఆర్సీ లీక్ నేపథ్యంలో దాదాపు ముప్పై మంది అభ్యర్థుల నుండి రెండు లక్షల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు చెప్పారు. ఇందులో కూడా రిజర్వేషన్ పాటించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రెండు లక్షల రూపాయలు, బీసీలకు అంతకంటే కొంత ఎక్కువ తీసుకున్నారని, ఇలా ఐదు లక్షల వరకు వసూలు చేశారని చెప్పారు.
మచ్చేందర్కు మహేందర్ అనే వ్యక్తి సహకరించినట్లుగా తెలుస్తోందని, ఆయనను అరెస్టు చేయాలన్నారు. ఇప్పటి వరకు పలువురిని అరెస్టు చేశామని, వారి నుండి 30 మంది అభ్యర్థులకు పేపర్ లీక్ చేసినట్లుగా గుర్తించామన్నారు. కేవలం డబ్బులు తీసుకున్న అభ్యర్థులకే పేపర్ లీక్ చేశారన్నారు. మిగతా వారికి లీక్ చేసినట్లుగా తెలియలేదన్నారు. ఇంకా విచారణ జరుపుతున్నామన్నారు. వారు డబ్బులు తీసుకొని, అనుకున్న అభ్యర్థులకు మాత్రమే పంపించారన్నారు.
రాజశేఖర్ పేపర్ రాగానే మొదట వాట్సప్ ద్వారా పంపించారని చెప్పారు. రాజశేఖర్ రైల్వేలో సీనియర్ ఉద్యోగి అని, ఆయన పరీక్ష కేంద్రం ఇంఛార్జిగా ఉన్నాడని చెప్పారు. అరెస్టైన వారిలో రాజశేఖర్(సీనియర్ సిగ్నల్ ఇంజనీర్)తో పాటు రైల్వే ఉద్యోగి మచ్చేందర్, ఎలక్ట్రానిక్స్ దుకాణం యజమాని చంద్రప్రకాశ్ ఉన్నారు.