మండలిలో ఏపీ రాజధాని బిల్లులు- చర్చ వద్దంటూ టీడీపీ నోటీసులు- మళ్లీ సెలక్ట్ కమిటీకి ?
ఏపీ అసెంబ్లీ నిన్న ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులు ఇవాళ మండలి ముందుకు వచ్చాయి. అయితే వీటిని ఎప్పుడు సభలో ప్రవేశపెట్టాలనే విషయంలో ఛైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం బడ్జెట్ పై చర్చ కొనసాగుతున్నందున దాని తర్వాత ఛైర్మన్ ఓ ప్రకటన చేసే అవకాశముంది.
ఏపీ బడ్జెట్లో అప్పులే.. ఆదాయమేది?: మోడీతో విభేదాలు లేవంటూ చంద్రబాబు
నిన్న ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులు ఇవాళ మండలి ముందుకు వచ్చినట్లు ఛైర్మన్ షరీఫ్ ఈ ఉదయం ప్రకటించారు. వీటిని ప్రభుత్వం తరఫున మంత్రులు లాంఛనంగా సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే విపక్ష టీడీపీ ఇందుకు సహకరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులు సభ ముందుకు వచ్చినట్లు ఛైర్మన్ ప్రకటించగానే టీడీపీ ఎమ్మెల్సీలు వీటిపై చర్చ చేపట్టవద్దంటూ ఛైర్మన్ షరీఫ్ కు సెక్షన్ 90 కింద నోటీసులు ఇచ్చారు. అయితే బిల్లులు ఇంకా ప్రవేశపెట్టనందున చర్చపై అభ్యంతరాల నోటీసులను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు.
Recommended Video
అయితే ఇవాళ మధ్యాహ్నం బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించవచ్చని తెలుస్తోంది. కానీ వీటిపై చర్చను టీడీపీ అడ్డుకుంటే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత టీడీపీ ఒత్తిడి చేసి మరోసారి సెలక్ట్ కమిటీకి పంపాలని గట్టిగా పట్టుబట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అప్పుడు మరోసారి ఛైర్మన్ నిర్ణయం కీలకంగా మారబోతోంది.