ఏపీలో మూడు రాజధానుల రచ్చ ... ఇన్ సైడర్ ట్రేడింగ్ పై టీడీపీ కొత్త చర్చ
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచన ప్రాయమైన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాలను రచ్చరచ్చ చేస్తోంది. అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు 4070 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని వైసిపి ఆరోపిస్తోంది. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతుంది టిడిపి కాదని వైసీపీ నేతలే ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని టిడిపి నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు.
అమరావతిలో అసైన్డ్ భూమికి బదులుగా ఇచ్చిన ప్లాట్లు రద్దు... షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్
ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతుంది వైసీపీనే అంటున్న టీడీపీ
తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అటు వైజాగ్ లోనూ, ఇటు కర్నూలులోనూ భూముల ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇక ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతల ఆరు వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతుంది వైసీపీనే అని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. సి బి ఐ ఎంక్వయిరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా టిడిపి నేతలు పేర్కొంటున్నారు.
జగన్ చేసిన ప్రకటన అంతర్యం అదే అంటున్న టీడీపీ, జనసేన
ఇక టీడీపీ తో పాటుగా, జనసేన పార్టీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ ను అస్త్రంగా మలుచుకుని వైసీపీ పై ఆరోపణలు చేస్తుంది. ప్రస్తుతం రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులు సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో అమరావతి లో భూముల ధరలు కుదేలై, వైజాగ్ ,కర్నూలులో భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని, ఇక అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడడం కోసమే వైసిపి ఇదంతా చేస్తోందని రాజధాని రైతులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.
వైజాగ్ లో వైసీపీ నేతల భూముల కొనుగోలుపై సీబీఐ విచారణకు డిమాండ్
విశాఖపట్నం చుట్టుపక్కల జగన్ సూచనల మేరకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా . మధురవాడ, భోగాపురం ప్రాంతంలో ఎంపీ విజయసాయి రెడ్డితోపాటు వైసీపీ నేతలు ఆరువేల ఎకరాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపితే అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటో బయటపడుతుందని అన్నారు. విశాఖలో భూములు కొని రాజధాని వికేంద్రీకరణ అంటున్నారని ఆయన మండిపడ్డారు .
అమరావతిలో టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు.. ఇప్పుడు సీన్ రివర్స్
ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి, జనసేనలు వైసీపీ నేతలు అక్కడ భూములు కొన్నందుకే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని అంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని వ్యవహారమంతా ఇన్సైడర్ ట్రేడింగ్ అంశం చుట్టూ తిరుగుతోంది. ఒకరిమీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ ఆరోపణలు చేస్తే.. తాజాగా టీడీపీ, జనసేనలు రివర్స్ ఎటాక్ చేస్తున్నాయి.