రాజధానిపై వైసీపీ స్వరం మారుతోందా: చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ: ఢిల్లీలో ఏం జరుగుతోంది..!
మూడు రాజధానుల పైన వైసీపీ కొద్ది రోజుల క్రితం కనిపించిన ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా విజయ సాయిరెడ్డి..మంత్రి అవంతి శ్రీనివాస్ చేస్తున్న తాజా వ్యాఖ్యలతో వారి స్వరంలో మార్పు కనిపి స్తుందా అనే అనుమానం కలుగుతోంది. తాజాగా వారిద్దరూ చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో కొందరిని అడ్డుపెట్టుకొని న్యాయ పర మైన చిక్కులు తేవాలని ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు సైతం అసలు రాజధాని మార్పుకు సీఎంకు అధికారం ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అమరావతి నుండి రాజధాని అంగుళం కూడా కదలటానికి వీళ్లేదని..తాను కేంద్రంతో మాట్లాడిన తరువాతే చెబుతున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇక, అమరావతి అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చిన తరువాతనే రాజధాని పైన తుది నిర్ణయమనే ప్రచారం సాగుతోంది.
విశాఖ టూర్ లో సీఎం జగన్ మౌనం వెనుక..: స్టీల్ సిటీలో కొత్త టెన్షన్: ఏం జరుగుతోంది..!
ముఖ్యమంత్రి విశాఖలో మౌనం వెనుక..
విశాఖను పరిపాలనా రాజధానిగా ఉండే అవకాశం ఉందంటూ తొలుత బయట పెట్టింది ముఖ్యమంత్రి జగన్. శాసనసభలో దీని పైన ఆయన సంకేతాలిచ్చారు. ఆ తరువాత జీఎన్ రావు కమిటీ సైతం ఇదే విధంగా సిఫార్సులు చేసింది. ఈ నెల 27న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇక ఆమోదమే మిగిలిందని అందరూ భావించారు. కానీ, ఇదే సమయంలో మరో హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీ నివేదిక పైన అసెంబ్లీలో చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటించాలని కేబినెట్ లో నిర్ణయించారు.
ఇదే సమయంలో ఈ ప్రతిపాదన తరువాత తొలి సారి విశాఖకు వచ్చిన సీఎం జగన్ కు అక్కడ భారీ స్వాగతం లభించింది. కానీ, జగన్ అక్కడ నుండే కీలక ప్రతిపాదన చేస్తారని భావించినా..సీఎం మాత్రం మౌనం పాటించారు. అదే ఇప్పుడు అనేక రకాల చర్చలకు కారణమైంది. అయితే, కమిటీ ఏర్పాటు.. అమరావతిలో నెలకొన్న భావోద్వేగాల కారణంగానే సీఎం ప్రసంగించలేదని చెబుతున్నారు. కానీ, దీని మీద ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.
సాయిరెడ్డి.. అవంతిల వ్యాఖ్యలతో..
విశాఖలో పరిపాలన రాజధాని అనే ప్రతిపాదన వచ్చిన తరువాత వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అక్కడ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు. అదే విధంగా జిల్లాకు చెందిన మంత్రి అవంతి సైతం కీలకంగా మారారు. అయితే, వారిద్దరూ వ్యూహాత్మకంగా చేసారా లేక వాస్తవాలనే చెప్పారో తేలియదు కానీ, రాజధాని తరలింపును అడ్డుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో కొందరు పెద్దల సహకారంతో న్యాయ పరమైన చిక్కులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమయం వచ్చిన సమయంలో ఢిల్లీలో ఆయనకు సహకరిస్తున్నది ఎవరో బయట పెడతామని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఇప్పటికే అమరావతి తరలింపు ప్రతిపాదనలను తప్పు బట్టారు. అసలు ముఖ్యమంత్రికి ఈ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు సైతం కొన్ని సందేహాలు లేవనెత్తారు. వీటికి న్యాయపరంగా చిక్కులు ఉంటాయని వారు సైతం వాదిస్తున్నారు.
ఢిల్లీలో ఏం జరుగుతోంది..
ఇక, ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పైన జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. జాతీయ పార్టీలకు ఈ విషయం చేరింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటనేది మాత్రం స్పష్టంగా బయటకు తెలియటం లేదు. ఇదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి..రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదని అమరావతి అంగుళం కూడా కదలటానికి వీళ్లేదని వ్యాఖ్యానించారు. తాను కేంద్రంతో మాట్లాడిన తరువాతనే చెబుతు న్నానంటూ చేసిన వ్యాఖ్య వైసీపీలో కలకలానికి కారణమైంది.
దీని పైన మంత్రి బొత్సా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సుజనా కు ప్రధాని ఆ విషయం చెవిలో చెప్పారా అని ప్రశ్నించారు. ఇక, దీని పైన కేంద్రానికి నివేదించేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారు. ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్రం పెద్దల నుండి వచ్చే రియాక్షన్ కు అనుగుణంగా తుది నిర్ణయం ఉండే అవకాశం ఉందని ప్రభుత్వంలోని ముఖ్యులు అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు అందరూ ఢిల్లీ వైపే చూస్తున్నారు. ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం దీని పైన స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.