కర్ణాటకలో బస్సు ప్రమాదం: ముగ్గురు ఏపీవాసుల మృతి
కర్నాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని ఘాట్రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన బస్సు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి.
మంగళూరు/అనంతపురం: కర్నాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని ఘాట్రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన బస్సు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతుల్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన హబీబా (50), మాబా ష(55), మహబూబ్బీ (47) ఉన్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం .. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని రమేష్రెడ్డి కాలనీ, పడమటిగేరికి చెందిన 44 మంది ఆదివారం ఉదయం ఓ ప్రైవేటు బస్సులో కర్నాటక రాష్ట్రం మంగళూరులోని దాదాపహాడ్ దర్గా దర్శనానికి వెళ్లారు.
దర్గాను దర్శించుకున్న అనంతరం మంగళవారం ఉదయం మంగళూరు మీదుగా ఉల్లాళ దర్గాకు బయలుదేరారు. మంగళూరుకు ఐదు కిలోమీటర్ల సమీపంలోని ఘాట్రోడ్డులో వీరు ప్రయాణిస్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ విషయాన్ని యాత్రికులకు తెలిపాడు. ఇంతలో బస్సు అదుపుతప్పి మలుపు వద్ద కొండను ఢీకొంది. దీంతో బస్సులోని హబీబా అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన మాబాషను మంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వీరిద్దరూ భార్యాభర్తలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహబూబ్బీ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మంగళూరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే పల్సాఘడీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.