టీడీపీకి పట్టం కట్టిన ఆ రెండు జిల్లాల ప్రజలు సంతోషంగా లేరట: ప్రతిపక్ష నేత జిల్లా కూడా
అమరావతి: తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలు ఆ రెండు జిల్లాలు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ రెండు జిల్లాల ప్రజలు ఆ పార్టీ వెంటే నడిచారు..ఒకట్రెండు సందర్భాల్లో తప్ప. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మెజారిటీ స్థానాలను చేజిక్కంచుకుంటూ వచ్చింది అధికార తెలుగుదేశం పార్టీ. అలాంటి జిల్లాలూ రెండు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే వెనుకంజ వేశాయి. అభివృద్ధిలో అథమ స్థానంలో నిలిచాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కూడా ఇలాంటి స్థితినే ఎదుర్కొంటోంది.
ప్రతిపక్షం చేస్తోన్న విమర్శ కాదు అది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంటరీలో పొందు పరిచిన వివరాలు ఇవి. రాజధాని అమరావతికి ఆనుకునే ఉన్న కృష్ణా జిల్లా ఈ సూచీలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కృష్ణా జిల్లా ప్రజలు అత్యంత ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారని చంద్రబాబు సర్కార్ రూపొందించిన విజన్ డాక్యుమెంటరీలో స్పష్టమైంది. కృష్ణా తరువాత విశాఖపట్నం, చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ విజన్ డాక్యుమెంటరీలో హ్యాపీనెస్ ఇండెక్స్ లో ప్రకాశం జిల్లా నాలుగోస్థానంలో నిలిచింది. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రబిందువైన గుంటూరు జిల్లాలో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం లేదని ఇండెక్స్ వెల్లడించింది. ఈ ఇండెక్స్ లో గుంటూరు జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచింది.
వైఎస్ జగన్ నాతో కలిసి రావాలి.. వస్తే స్వాగతిస్తా: చంద్రబాబు: జగన్ కు వచ్చేది ఒకటి, రెండు సీట్లే
చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఆందులో హ్యాపీనెస్ ఇండెక్స్ - 2018 అంశాన్ని పొందుపరిచారు. ప్రజలు ఏ స్థాయిలో ఆనందంగా, సంతోషకరంగా జీవిస్తున్నారనే విషయాన్ని ఈ ఇండెక్స్ సూచిస్తుంది. ఆయా జిల్లాల్లో నమోదైన తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి, ఆరోగ్యకర జీవనాన్ని గడిపే ప్రజల కాల వ్యవధి, సామాజిక అంశాలు, ఇతరులకు దానం చేసే గుణం, అవినీతి, రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా.. ప్రజలు తమ తమ అభిరుచికి అనుగుణంగా జీవిస్తున్నారా? లేదా? అనే విషయాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ను రూపొందించింది.
ప్రభుత్వ శాఖల్లో గానీ, ప్రైవేటు సంస్థలు కార్యకలాపాల్లో గానీ
ఇందులో- కృష్ణా జిల్లా టాప్ లో నిలిచింది. ఈ జిల్లా వాసులు అత్యంత ఆనందకరం పరిస్థితుల్లో నివసిస్తున్నారని ఇండెక్స్ లో వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో గానీ, ప్రైవేటు సంస్థలు కార్యకలాపాల్లో గానీ అవినీతిని ఎదుర్కొన్న సందర్భాలు కృష్ణా జిల్లా వాసులకు పెద్దగా ఎదురు కాలేదట. ఈ జిల్లాలో జీడీపీ కూడా అత్యధికంగా నమోదైంది. కృష్ణా జిల్లా వాసులకు దానగుణం అధికమని ఇండెక్స్ చెబుతోంది. ఇదే తరహా పరిస్థితి విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లోనూ నెలకొని ఉంది. ఎందుకంటే- కృష్ణా తరువాత విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో హ్యాపీనెస్ ఇండెక్స్ లో రెండు, మూడు స్థానాల్లో నిలవడమే దీనికి కారణం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా
ఈ ఇండెక్స్ సూచించిన వివరాల ప్రకారం.. కడప, అనంతపురం, విజయనగరం, ప్రకాశం జిల్లాలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగానే భావించాలి. వాటిల్లో కడప.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. ఈ జిల్లాలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మిగిలిన అనంతపురం, విజయనగరం జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటివి. విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్ఆర్ సీపీ మూడింటిని మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ ముగ్గురిలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పార్టీ ఫిరాయించారు. చంద్రబాబు క్యాబినెట్ లో గనుల శాఖ మంత్రి. రాజకీయంగా అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఈ జిల్లాల్లో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉండగా.. వైఎస్ఆర్ సీపీకి దక్కినవి రెండే. ఆ ఇద్దరిలో కూడా కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.
రెండు జిల్లాల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని
తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వచ్చిన ఈ రెండు జిల్లాల్లో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, అధికారంలో ఉన్న తెలుగుదేశమే చెబుతోంది. ఈ రెండు జిల్లాల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, తలసరి ఆదాయం గణనీయంగా క్షీణించిందని ప్రభుత్వం లెక్కలు వేసింది. ప్రజల ఆరోగ్యకర జీవన ప్రమాణాలు పడిపోయాయని వెల్లడించింది. 2017లో హ్యాపీనెస్ ఇండెక్స్ లో అగ్రస్థానంలో నిలిచిన శ్రీకాకుళం జిల్లా.. ఏడాది తిరిగే సరికి ఆరో స్థానానికి దిగజారింది. అక్కడ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు యథేచ్ఛగా అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారని, అందువల్లే ర్యాంక్ దిగజారిందని విమర్శలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే- శ్రీకాకుళం జిల్లా కూడా టీడీపీ చేతుల్లోనే ఉంది.
తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది
గుంటూరు జిల్లా కూడా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నట్లు ఇండెక్స్ లో గుర్తించారు. 2017 హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఆరో స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా 2018 నాటికి మూడు ర్యాంకులు దిగజారింది. తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. రాజధానిని ప్రకటించిన తరువాత గుంటూరు జిల్లాలో దోపిడీ తీవ్రమైందని, అవినీతి రెక్కలు విచ్చుకుందని ఈ ఇండెక్స్ ద్వారా వెల్లడవుతోంది. ఎన్నికల ఏడాది సమీపించే సమయానికి ఈ జిల్లా ప్రజలు మరింత అధికంగా దోపిడీకి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే స్పష్టం కావడంతో.. సమాధానం చెప్పలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ నేతలది. వాటన్నింటినీ కప్పిపుచ్చుతున్నారు నాయకులు. దీనిపై ఎదురయ్యే ప్రశ్నలకు వారి నుంచి సమాధానం రావట్లేదు.