ఆడుకుంటూ వెళ్లి కారులో ఎక్కారు: డోర్స్ లాక్ కావడంతో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి
కృష్ణా: జిల్లాలోని బావులపాడు మండలం రేమల్లె గ్రామంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఆడుకోవడానికి పార్క్ చేసిన కారులో ఎక్కిన ముగ్గురు చిన్నారులు.. కార్ డోర్స్ లాక్ కావడంతో ఊపిరాడక మృత్యువాతపడ్డారు.
స్థానిక స్పిన్ టెక్ట్స్ కర్మాగారం క్వార్టర్స్లో ఈ ఘటన జరిగింది. అప్సానా, యాసిన్, పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే, ప్రమాదవశాత్తు కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు రాలేకపోయారు.
ఈ క్రమంలో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు కూడా కారులోనే మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు కూడా ఆరేళ్లలోపు వారే. వీరిలో ఇద్దరు పశ్చిమ బెంగాల్, మరొకరిని ఒడిశాకు చెందిన బాలికగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కాసేటి క్రితం వరకు కూడా ఆడుకున్న చిన్నారులు.. ఒక్కసారిగా విగత జీవులు కావడంతో వారి కుటుంబాలతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, చిన్నారుల ఒంటిపై కాలిన గాయాలు కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.