బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు: ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలోని లాలా చెరువు ప్రాంతంలోని ఓ ఇంట్లో శనివారం తెల్లవారుజామున బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
బాణసంచా తయారుచేస్తుండగా విద్యుదాఘాతం కారణంగా భారీ పేలుడు సంభవించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సుబ్బారావుపేటలోని పూరింట్లో ముత్యాలరెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. ఇతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరి కుటుంబం ఏటా దీపావళికి బాణసంచా తయారు చేస్తుంటుంది.
ఈ సారి కూడా రాత్రి సమయంలో టపాసులు తయారు చేస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అగ్నికీలల్లో ముత్యాలరెడ్డి కుటుంబ సభ్యులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి వెళ్లి క్షతగాత్రుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముత్యాల రెడ్డి భార్య సూర్యాకాంతం, కోడలు ధనలక్ష్మి మృతి చెందారు. అనంతరం కుమారుడు వినయ్రెడ్డి కూడా చనిపోయాడు. ముత్యాల రెడ్డి, అతని మేనకోడలు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఇలా బాణాసంచా తయారు చేసే పరిశ్రమలను మూసేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.