అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి..
అనంతపురం జిల్లాలో శుక్రవారం(డిసెంబర్ 18) రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు ఒకేచోట చోటు చేసుకున్నాయి. మొదట ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందగా... సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
తొలుత ఓ కారు అతివేగంతో బైక్ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రాజశేఖర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడ గుమిగూడారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఓ లారీ వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.మృతులను రాజశేఖర్, శ్రీనివాస్, శివమ్మలుగా గుర్తించారు. క్షతగాత్రులను బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు.
రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జమ్మలమడక గ్రామానికి చెందిన కోటయ్య, యేసయ్య, మార్తయ్యగా గుర్తించారు.
నాలుగు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో డీసీఎం-లారీ ఢీకొని నలుగురు చిన్నారులు మృతిచెందారు. క్రిస్మస్ మాసం సందర్భంగా క్రైస్తవులు వేకువ జామున ప్రార్థనలు చేయడానికి బయలుదేరారు. వీరు రోడ్డు దాటుతున్న సమయంలో డీసీఎం లారీ ఢీకొట్టగా నలుగురు చిన్నారులు మృతిచెందారు. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 40 మంది రోడ్డుపై ఉన్నారు. గాయపడినవారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.