కృష్ణా జిల్లాలో వింత శిశువు జననం: చూసేందుకు ఎగబడ్డ జనం
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఓ వింత శిశువు జన్మించింది. గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన షేక్ హసీనా (24) పురిటి నొప్పులతో గన్నవరం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. మధ్యాహ్నం 3 గంటలకు గైనకాలజిస్టు డాక్టర్ అరుణ కాత్యాయిని హసీనాకు డెలివరీ నిర్వహించడంతో శిశువుకు జన్మనిచ్చింది.
సాధారణ ప్రసవంలో జన్మించిన మగ బిడ్డకు మూడు కాళ్లు ఉండటంతో అరుదైన వింత శిశువు జన్మించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే శిశువు జన్మించగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. షేక్ బాషా, హసీనా దంపతులకు రెండో సంతానంగా మూడు కాళ్లతో మగబిడ్డ జన్మించింది.
ఆ శిశువుకి రెండు కాళ్లతో పాటు నడుం దగ్గర మరో కాలు కూడా ఉంది. ఈ సందర్భంగా గన్నవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు మాట్లాడుతూ ఉదయం 7 గంటలకు కాన్పుకోసం హసీనా తల్లితో సహా వచ్చి ఆసుపత్రిలో చేరిందని అన్నారు. తల్లి క్షేమంగా ఉందని శిశువు మాత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
జన్యుపరంగా ఏర్పడే అసమతుల్యత కారణంగా ఇటువంటి జననాలు, మరణాలు సంభవిస్తాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి సంతానంగా పాప జన్మించగా, ద్వితీయ సంతానంగా మగ శిశువు జన్మించినట్లు హసీనా తెలిపారు. వింత శిశువును ప్రజలు ఎంతో ఆసక్తితో చూశారు.