"పీకే"-3 ..! ఏపీలో అన్ని పార్టీలు నమ్ముకుంది "పీకే" మంత్రమే ! ఏమా కథ !
ఏపి లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ సరళి పై ఎవరికీ స్పష్టత రాలేదు. ఓటరు నాడి అందుకోలేక పోతున్నారు. ఇదే సమయంలో మూడు పార్టీలు పీకే లను నమ్ముకున్నారు. పీకే ద్వారా ఓట్లు కురుస్తాయని అంచనా వేసారు. అయితే ఓట్ల సరళి మాత్రం పైకి ఎవరికి వారు తమకే అనుకూలమని చెబుతున్నా..ఇంకా ఓటరు నాడి అర్దం కాక పోలింగ్ సరళి పైనే లెక్కలు వేస్తున్నారు. తాము నమ్ముకున్న పీకే ఎంత వరకు మేలు చేసందనే దాని పై దృష్టి సారించారు.
వైసిపి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో..
వైసిపి నమ్ముకున్న పీకే..ప్రశాంత్ కిషోర్. రెండేళ్ల క్రితం వైసిపి వ్యూహకర్తగా ఎగ్రిమెంట్ చేసుకున్న నాటి నుండి ఆయన ను వైసిపి పూర్తిగా నమ్మింది. ప్రశాంత్ కిషోర్..జగన్ ఇద్దరూ పార్టీని ఎన్నికల్లో విజయం వైపు తీసుకెళ్లటానికి అనేక సార్లు సమావేశం అయ్యారు. జగన్ పాదయాత్రను ప్రతీ ప్రాంతానికి తీసుకెళ్లేలా..కొన్ని వ్యూహాలను ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు అమలు చేసారు. ఇక నవరత్నాలు..జగన్ ప్రసంగాలు..ఎన్నికల్లో అభ్యర్దుల ఎంపిక..ప్రచార వ్యూహాలు వంటివి ప్రశాంత్ కిషోర్ తో చర్చల తరువాత మాత్రమే జగన్ ఫైనల్ చేసారు. ఇక, పోలింగ్ ముగిసిన తరువాత ప్రశాంత్ కిషోర్ వీడ్కోలు సభలో జగన్ ఏపికి కాబోయే సక్సెస్ ఫుల్ సీయం అంటూ కితాబిచ్చారు. అయితే, తాము అధికారంలోకి వచ్చినా ప్రశాంత్ కిషోర్ సేవలు అందించాలని జగన్ కోరారు. ఈ ఎన్నికల్లో వైసిపి 120 సీట్లకే పైగా గెలుచుకుంటుందని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
టిడిపిలోనూ పీకే మీదే భారం..
అయిదేళ్లు అధికారంలో..నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న టిడిపి అధినేత సైతం పీకే పైనే ఆశలు పెట్టుకున్నారు. అయిదేళ్ల పాటు తాము అందించిన పాలన కంటే ఎన్నికల ముందు తాము పధకాల పేరుతో లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన నగదు కారణంగా ఓటర్లు తమకు అనుకూలంగా ఓట్లు వేస్తారని అంచనా వేస్తున్నారు. సరిగ్గా పోలింగ్ ముందు రోజు టిడిపి నమ్ముకున్న పీకే (పసుపు -కుంకమ ) లబ్ది దారులే పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నారని వారు ఖచ్చితంగా టిడిపి కే ఓటు వేసారనేది టిడిపి నేతల విశ్లేషణ. ఏపిలో డ్వాక్రా మహిళలు దాదాపు 94 లక్షల మంది ఉన్నారు. వారికి రెండో విడత పసుపు - కుంకుమ కింద మూడు విడతల్లో పది వేల రూపాయల నగదు అందచేసారు. సరిగ్గా పోలింగ్ మందు రోజు మూడో విడత కింద 3500 రూపాయలు జమ అయ్యాయి. ఈ పీకే తమను గెలిపిస్తుందని..తమకు 130 సీట్లు పైగా వస్తాయని టిడిపి అంచనా వేస్తోంది.
పికే మీదే జనసేన భారం
ఇక, మార్పు తమ లక్ష్యం అంటూ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన సైతం పీకే మీదే అధార పడింది. జనసేన అధినేత పీకే (పవన్ కళ్యాన్) వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే పార్టీకి బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు కు పీకే (పవన్ కళ్యాన్) మద్దతు కీలక భూమిక పోషించింది. ఇక, ఇప్పుడు జనసేన ఎన్నికల తరువాత తాము ఎన్ని సీట్లలో గెలిచేది బయటకు చెప్పక పోయినా..ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు మాత్రం పీకే వలన మాత్రమే అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సైతం ఎన్నికల బరిలో ఉన్నా..ఆయన పాత్ర నామమాత్రంగానే కనిపించింది. ఇక, పవన్ పోటీ చేసిన రెండు స్థానాలతో పాటుగా నాగబాబు, సీబిఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ వంటి వారిని గెలిపించుకొనే బాధ్యత సైతం పీకే తీసుకున్నారు. మరి..పీకే ఎఫెక్ట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉందో ఫలితాల్లో వెల్లడి కావాల్సి ఉంది.