బాబుతో ముగ్గురు మంత్రులు: టిడిపిలో చేరికపై చర్చ
హైదరాబాద్: ముగ్గురు రాష్ట్ర మంత్రులు, విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెసు శాసనసభ్యులు గురువారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. వారు చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాస రావు చంద్రబాబును కలిశారు.
విశాఖపట్నం జిల్లాకు చెందిన రమేష్ బాబు (పెందుర్తి), కన్నబాబు (ఎలమంచిలి), అవంతి శ్రీనివాస్ (భిమిలీ), చింతలపూడి వెంకట్రామయ్య (గాజువాక) చంద్రబాబు నాయుడిని కలిశారు. గంటా శ్రీనివాస రావుతో పాటు ఈ నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
రాష్ట్ర విభజనతో అసంతృప్తికి గురైన మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలే చేరుతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రులు కూడా రాష్ట్ర విభజనపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అయితే, మొదటి నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలిచారు.
మరికొంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.