జగన్కు మరో ముగ్గురు ఎమ్మెల్యేల షాక్: జూపూడి, కోడెలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు షాకివ్వనున్నారని తెలుగుదేశం నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. త్వరలోనే మరో ముగ్గురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారని అన్నారు.
ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బిజెపికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బిజెపికి పడుతుందని హెచ్చరించారు.
స్పీకర్ కోడెలను కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద రావును శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. వైయస్సార్ కాంగ్రెస పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 16మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పార్టీ ఫిరాయింపులను టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు.
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తమ పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరినట్లు తెలిపారు.