ఆ ముగ్గురు ఓట్లు వేసేది ఎక్కడో తెలుసా: తనయుడి నియోజకవర్గంలో తండ్రి ఓటు: ప్రముఖుల ఓటింగ్ ఇలా
ఏపిలో హోరా హోరీ ఎన్నికల్లో ఆ ముగ్గురు ఇప్పుడు సీయం అభ్యర్దులు. ఒకరు ప్రస్తుతం సీయంగా ఉంటూనే తన పదవి రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉంటూ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనేది మరొకరి లక్ష్యం. ఈ ఇద్దరు కాదు..మార్పు కోసం తనకు అవకాశం ఇవ్వమని కోరుతున్నారు మరో పార్టీ అధినేత. అయితే, ఈ ముగ్గురు ఇప్పుడు ఎక్కడ ఓట్లు వేస్తున్నారో తెలుసా..
లోకేశ్ నియోజకవర్గంలో బాబు ఓటు
టిడిపి అధినేత చంద్రబాబు తన తనయుడు లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఉండవల్లి లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కుటంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఉదయం 7.30 గంలకు ఉండవల్లి లోని మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేయనున్నారు. ఆయన గత ఎన్నికల్లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నివాసం ఉండేవారు. అక్కడే ఓటు హక్కు ఉండేది. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ పరిధిలో చూస్తే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఈ ప్రాంతం ఉంది. నవ్యాంధ్ర ఓట రుగా నమోదు చేయించుకున్న తరువాత చంద్రబాబు తన కుటుంబ సభ్యుల తో కలిసి తన కుమారుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే తొలి ఓటు వేయనున్నారు.
సొంత నియోజకవర్గంలో జగన్ ఓటు..
ఇక, వైసిపి అధినేత జగన్ తాను పోటీ చేస్తున్న కడప జిల్లాలోని పులి వెందుల నియోజకవర్గంలో ఓటు వేయనున్నారు. తొలి నుండి పులివెందుల లోనే జగన్ ఓటు ఉంది. ఆయన తన కుటుంబ సభ్యుల ఓట్లు అక్కడే ఉన్నాయి. ఈ సారి సైతం జగన్ పులివెందుల నుండి అసెంబ్లీ బరిలో ఉన్నారు. పులివెందుల లోని భాకరాపురం లో ఉన్న ఎంపిపీఎస్ పాఠశాల లోని పోలింగ్ బూత్ లో జగన్ తన సతీమణి భారతి తో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పార్లమెం ట్ పరంగా చూస్తూ ఈ ప్రాంతం కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. అక్కడి నుండి వైసిపి అభ్యర్ది గా జగన్ సోదరుడు అవినాశ్ రెడ్డి ..టిడిపి నుండి ఆదినారాయన రెడ్డి బరిలో ఉన్నారు.
బెజవాడ లో పవన్ ఓటు..
కొద్ది కాలం క్రితం హైదరాబాద్ నుండి పవన్ తన ఓటును బెజవాడ కు మార్చుకున్నారు. జనసేన అధినేతగా పవన్ క ళ్యాన్ ప్రస్తుతం భీమవరం తో పాటుగా విశాఖ లోని గాజువాక నుండి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. ఆయన బెజ వాడ లోని పటమట లో ఉన్న నారాయణ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించిన ఎల్వీ సుబ్రమణ్యం , రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జికె ద్వివేదీ విజయవాడ లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.