అరకు సమీపంలో విషాదం- కొండచరియలు విరిగిపడి ముగ్గురు రైల్వే కార్మికుల మృతి...
విశాఖపట్నం జిల్లాలోని కొత్తవలస- కిరండోల్ మార్గంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు రైల్వే కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిమిడిపల్లి- బొర్రా గుహలు స్టేషన్ల మధ్య ట్రాక్ పై భారీగా కొండచరియలు పడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది లేకుండా వాటిని తొలగించేందుకు వెళ్లిన రైల్వే కార్మికులు వీటి బారిన పడ్డారు.
గూడ్స్ రవాణా ఎక్కువగా సాగే ప్రమాదకరమైన కొత్తవలస- కిరండోల్ మార్గంలో కొండ చరియల మధ్య నుంచి తూర్పు కోస్తా రైల్వే అద్భుత ఇంజనీరింగ్ పనితనంతో రైల్వే ట్రాక్ నిర్మించింది. ఏటా వర్షాలు పడినప్పుడు ఇక్కడ కొండ చరియలు విరిగిపడటం సహజమే అయినా... వేసవిలో కురిసిన అకాల వర్షాలతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
కొండ చరియలు విరిగి రైల్వే కార్మికులు గాయపడిన వార్త తెలియగానే అధికారులు వెంటనే స్పందించి రిలీఫ్ వ్యాన్ పంపడమే కాకుండా క్షతగాత్రులను ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నిత్యం ఛత్తీస్ ఘడ్ లోని బైలదిల్లా గనుల నుంచి విశాఖ పోర్టుకు కొత్తవలస-కిరండోల్ మార్గం ద్వారానే ఐరన్ ఓర్ రవాణా అవుతుంటుంది. రోజూ దాదాపు 12 గూడ్స్ రైళ్లు ఈ మార్గంలో ప్రయాణం చేస్తుంటాయి. లాక్ డౌన్ కారణంగా సిబ్బంది కొరత ఉండటంతో ప్రస్తుతం రోజుకు ఐదు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంతో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి..