కలకలం:ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం;తహసీల్దారు,ఆర్ఐ,వీఆర్వో సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా పప్పుబెల్లాల్లాగా పంచిపెట్టిన రెవిన్యూ అధికారులపై కలెక్టర్ ప్రద్యుమ్న కొరడా ఝళిపించారు. గవర్నమెంట్ ల్యాండ్ లను కావాల్సిన వారికి కట్టబెట్టడం,వెబ్ల్యాండ్లో తమ ఇష్టమొచ్చినట్లుగా మార్పులు చేర్పులు చేసేయడం వంటి చర్యలు పాల్పడినందుకు గాను ఆయన ఓ ఎమ్మార్వోతో సహా ముగ్గురు రెవిన్యూ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే...
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పరిథిలో ఒకరి భూములను మరొకరి పేరుపైకి మార్చడం, ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట నమోదు చేయడం వంటి అభియోగాలతో తహసీల్దారు భారతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపీనాథ్, వీఆర్వో మురళిలను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామం పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు వెబ్ల్యాండ్లో రికార్డుల మార్పులు చేయడంపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో చిత్తూరు ఆర్డీవో కోదండరామిరెడ్డి ఇటీవల విచారణ నిర్వహించారు.
అనంతరం ఆయన విచారణ నివేదికను కొద్ది రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నఅందచేశారు. ఈ నివేదికలో ఆర్డీవో అక్కడి రెవిన్యూ సిబ్బంది ఒకరి భూములను ఏవిధంగా మరొకరిపైకి మార్చారు, ప్రభుత్వ భూములను ఎలా ఇతరులకు కట్టబెట్టారో సవివరంగా నివేదించినట్లు తెలిసింది. వాటిలో కొన్ని అక్రమాల వివరాలు ఇవి. ఆళ్లమడుగు గ్రామం పరిధిలోని సర్వే నంబరు 137/2లోని మోహన్రామిరెడ్డికి చెందిన భూమి, సర్వే నంబరు 140/2లోని 1.40సెంట్ల బాలచంద్రారెడ్డి భూములను మరో వ్యక్తి పేరుతో 2016 మేలో అప్పటి తహసీల్దారు రేణుక పట్టాపాసుపుస్తకాలు ఇచ్చారు.
ఈ పాసుపుస్తకాల ఆధారంగా ప్రస్తుత తహసీల్దారు భారతి 2016 సెప్టెంబరు 27న వెబ్ల్యాండ్లో నమోదు చేశారు. ఇలా ఒకరి భూమిని మరొకరి పేరుపై అక్రమంగా మార్చడంతో పాటు.. ఏకంగా ఆన్లైన్లో ఎక్కిండంపై అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొతుల పట్టాదారు పాసుపస్తకాలు మంజూరు చేసిన రేణుక ఇటీవలే డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి పొందారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సీసీఎల్ఏకు నివేదించారు.
మరో కేసులో ఆళ్లమడుగు గ్రామం పరిధిలో సర్వే నంబరు 305/1లో 0.25సెంట్లు, 305/2లో 3.99సెంట్ల ప్రభుత్వ భూమిని గతంలో పనిచేసిన తహసీల్దారు రేణుక ఓ మహిళపై పట్టా పాసుపుప్తకాలు మంజూరు చేశారు. ఇదే గ్రామం పరిధిలో సర్వే నంబరు 501/1లో 4.32 సెంట్లు, 501/2లో 4.64సెంట్లు, 501/3లో 4.33సెంట్లు, 501/4లో 4.44 సెంట్లు, 501/5లో 4.77 సెంట్లు, 501/7లో 4.00సెంట్లు...మొత్తంగా 26.55 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు కట్టబెట్టేశారు. ఇందులో ప్రస్తుత తహసీల్దారు భారతి, గోపీనాథ్, వీఆర్వో మురళి ప్రమేయాన్ని విచారణాధికారి తేల్చారు.
ఈ విధంగా ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయడమే కాదు ఆ మేరకు మార్పులను ఏకంగా వెబ్ల్యాండ్లోనూ పొందుపర్చడం గమనార్హం. అయితే భూముల అన్యాక్రాంతం విషయంలో తమ తప్పేమి లేదని అధికారులు వాదించినట్లు తెలిసింది. కింది స్థాయి సిబ్బంది వల్లే ఈ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపించినట్లు సమాచారం. "మీసేవ దరఖాస్తుల కోసం ఆర్ఐ అడిగితే డిజిటల్ కీ ఇచ్చానని తహసీల్దారు చెప్పగా, తాను కంప్యూటర్ ఆపరేటర్కు ఇచ్చామని ఆర్ఐ వివరణ ఇవ్వడం విశేషం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ భూములను ఆన్యాక్రాంతం చేయడం, డిజిటల్ కీని దుర్వినియోగం చేయడంలో రెవెన్యూ అధికారుల ప్రాతను నిర్థారించుకున్నజిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. భూముల అన్యాక్రాంతంపై ఒకే మండలంలో ముగ్గురు అధికారులపై వేటు పడడం ఇదే మొదటి సారి. దీంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖలో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది.