బి అలర్ట్: ఇంకో 48 గంటలు..పిడుగుపాటుకూ ఛాన్స్: సీమ దాకా భారీ వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికే వరుస అల్పపీడనాల ప్రభావంతో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు రాష్ట్రం మొత్తం జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులన్ని పూర్తిగా నిండిపోయాయి. కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. అటు నాగావళి, వంశధారలకు ప్రవాహం కొనసాగుతోంది. ప్రవాహ తీవ్రత పెరుగుతూనే ఉంది. కృష్ణాపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
మరో రెండు రోజులు..
తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలపై ద్రోణి ప్రభావం కనిపించింది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. అల్పపీడనం ప్రభావం వల్ల ఈ మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు దాకా..
శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలపై అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంటుందని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తోన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెబుతున్నారు. కడప, అనంతపురం జిల్లా దక్షిణ ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అనంతపురం దక్షిణ ప్రాంతంలో సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు, నిపుణులు స్పష్టం చేస్తోన్నారు.
సంతబొమ్మాళిలో అత్యధిక వర్షపాతం..
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 153 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. పలాస-148, కోరుకొండ-114,మండపేట-113, టెక్కలి-110, కోటబొమ్మాళి-104, ఇచ్ఛాపురం-102 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కళింగపట్నం-99, నెల్లిపాక-87, దార్లపూడి-80, నిమ్మాడ-80, సోంపేట-76, అనపర్తి-74, పెదపూడి-73, దేవీపట్నం-68, పెద్దౌలాపురం-68, కొత్తపల్లి-64, లక్ష్మీనరసంపేట-62 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
విశాఖలో చిరుజల్లులు..
అల్పపీడన ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం నగరంలో కొన్ని గంటలుగా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పెందుర్తి, అనకాపల్లిల్లో అత్యధికంగా 12 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాయుడుతోట-57, ఎంవీపీ కాలనీ-56, గోపాలపట్నం-45, అరిలోవ-45, సీతమ్మధార-41, యలమంచిలి-40, కాపులుప్పాడ-40, అడవివరం-40, రోలుగుంట-37 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. ద్వారకా నగర్-37, పెందుర్తి-36, సింహాచలం-35, మాధవధార-27, తులసీనగర్-27, మధురవాడ-25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదే పరిస్థితి సోమవారం వరకూ కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి.