13 గంటల్లో 36వేలకు పైగా పిడుగులు, మంగళవారం భయం భయంగా, దడపుట్టించాయి
అమరావతి: మంగళవారం రాత్రి గుంటూరు, కృష్ణా జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పదమూడున్నర గంటల పాటు పిడుగులు దడ పుట్టించాయి. ఏకంగా 36,479 పిడుగులు పడ్డాయి. ఏడుగురు మృతి చెందారు. ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి 15 రోజుల వ్యవధిలో మొత్తం 10,.436 పిడుగులు పడ్డాయి. కానీ మంగళవారం ఒక్కరోజే 36వేలకు పైగా పిడుగులు పడ్డాయి.
గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏపీవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల పిడుగులు పడినట్లు విపత్తు నిర్వహణ సంస్థ గుర్తించింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 35 వేలకు పైగా పిడుగులు పడగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 9057 పిడుగులు అత్యల్పంగా పడ్డాయి. పిడుగులు నదులు, చెరువులు, వాగులు, చెట్లు, మైదాన ప్రాంతాల్లో పడ్డాయి.
మంగళవారం ఉదయం నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు దాదాపు 13.30 గంటల పాడు పిడుగులు ప్రజలను భయపెట్టాడు. 11 జిల్లాల్లో 369 మండలాల ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. పిడుగు ఎక్కడ పడుతుందో అని చాలామంది భయాందోళనకు లోనయ్యారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఇంత సుదీర్ఘ సమయం పిడుగుల వర్షం కురవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి.
సాధారణంగా ఒక్కో పిడుగు సగటున పదహారు కి.మీ. ప్రయాణం చేస్తుంది. వాతావరణాన్ని బట్టి 360 డిగ్రీల కోణంలో ఎటైనా దిశ మార్చుకుంటుంది.
కాగా, పిడుగుపాటు ప్రమాదాలపై ప్రజలను ఎప్పటికప్పుడు ఆల్ ఇండియా రేడియో, ఎఫ్ఎం రేడియోల ద్వారా పిడుగులు పడే ప్రాంతాల గురించి ముందస్తు సూచనలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎస్సెమ్మెస్లతో అప్రమత్తం చేశారు.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని రకాల మీడియా, కాలేజీలు, స్కూళ్లు, పాఠశాలలు, గ్రామాల వారీగా అంగన్వాడీలు, పొదుపు సంఘాలతో అవగాహన సదస్సులు, కరపత్రాలు, సినిమాహాళ్ల ద్వారా ప్రచారం చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్చరికలు అందిన వెంటనే పొలంలో పనిచేసే రైతులు, కూలీలు సురక్షితప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.