ఆక్వాఫుడ్ పార్క్పై బాబు సర్కార్ మక్కువ: తాగునీటికే దిక్కులేదు.. వ్యర్థాల తరలింపునకు 26 కి.మీ పైపులై
మూడేళ్లుగా రైతులు ఆందోళన చేస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు పరిధిలో ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం దిశగా ఏపీ సర్కార్ అడుగులేస్తున్నది.
అమరావతి: పచ్చని పంట పొలాలను నాశనం చేసే ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణ పనులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా బీమవరం మండలం తుందుర్రు, కంసాల బేతపూడి, జొన్నల గరువు గ్రామాల రైతులు పోరాడుతున్నారు. కానీ ఆక్వాఫుడ్ పార్క్ యాజమాన్యం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ రైతుల ఆందోళనను పట్టించుకోకుండా ఫుడ్ పార్క్ నిర్మాణం దిశగా ముందుకు సాగుతున్నాయి. అందుకు అవసరమైతే పోలీసు భద్రతను కూడా చేపట్టి మరీ ఫుడ్ పార్క్ నిర్మిస్తున్నారు.
గట్టిగా స్వరం వినిపించిన రైతులు, ఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాట నాయకులు, గ్రామస్తులపై ఐపీసీలోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జనావాసాల మధ్య 40 గ్రామాలు, ఆరు మండలాల ప్రజలకు పైపెచ్చు 35 వేల మందికి పైగా మత్స్యకారులకు తీవ్ర నష్టం చేకూర్చే ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపేయాలని వారు కోరుతున్నారు. ఆక్వాఫుడ్ పార్క్ పైపులైన్ నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో బాధిత గ్రామాల ముఖ్య నాయకులు రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు.
వ్యతిరేకతను తోసి రాజని ఇలా జీవో జారీ
ఆందోళన ఉధ్రుతం చేయడానికి ఆ మూడు గ్రామాల రైతులు, ప్రజలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్న కబుర్లు, ఆచరణపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు నుంచి సుమారు 26 కిలోమీటర్ల దూరంలోని క్రుష్ణా జిల్లా క్రుతివెన్ను మండలం చిన గొల్లపాలెం వద్ద సముద్రంలోకి పైపులైన్ వేసి ఆక్వా ఫుడ్ పార్కు నుంచి వ్యర్థాలను తరలించేందుకు పైపు లైను నిర్మించేందుకు 2017 అక్టోబర్ 31న జీవో విడుదల చేసింది. ఆక్వా ఫుడ్పార్క్ నిర్మాణాన్ని నిలుపు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఫుడ్పార్క్ వ్యర్థ జలాల తరలింపునకు పైప్లైన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీచేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
మభ్య పెట్టేందుకే ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం నాటకాలు
తుందుర్రు నుంచి సముద్ర తీర గ్రామం గొల్లపాలెం వరకూ 26.5 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఇందుకోసం రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అందులో రూ.5.5 కోట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఎపిపిసిబి), రూ.5.5 కోట్లు ఆక్వా ఫుడ్ కంపెనీ వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. పైప్లైన్ కాలపరిమితి 20 ఏళ్లుగా ఉండనున్నట్లు తెలిపారు. ఓ ప్రయివేటు ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వ సొమ్ముతో పైప్లైన్ నిర్మించాలనుకోవడం అంతటా చర్చనీయాంశంగా మారింది. కానీ ఇదంతా 2019 ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు, ఫ్యాక్టరీ యాజమాన్యం ఆడుతున్న నాటకాలని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. తుందుర్రు పోరాట కమిటీ కన్వీనర్ ఆరేటి వాసు మాట్లాడుతూ తమ గ్రామాల్లో టీడీపీ లేదని, ఇక రాదని పేర్కొన్నారు. తమను మభ్య పెట్టేందుకే 26 కిలోమీటర్ల పైపులైన్ నిర్మిస్తామని చెప్తున్నారన్నారు.
26 కిమీ పొడవున పైపులైన్ నిర్మాణమా?
ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాకు వాడుతున్న పైపులైన్లే లీకవుతుంటే 26 కిలోమీటర్లకు పైపులైన్ నిర్మిస్తామంటే తాము నమ్మాలట అని ఆరేటి వాసు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలర్పించైనా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని జొన్నల గరువు పోరాట కమిటీ నాయకుడు కొయ్య మహేశ్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో మూడు పంటలు పండే పంటలు రసాయనాలతో చౌడు బారతాయని, తమ పిల్లల భవిష్యత్ మరింత దుర్భరంగా మారుతుందన్నారు. మూడేళ్లుగా ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించడానికి ఇబ్బందేమిటని తుందుర్రు గ్రామ వాసి బెల్లపు సత్తిబాబు చెప్పారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారే తప్ప ఫ్యాక్టరీని ఇతర ప్రాంతాలకు తరలించకపోవడం దారుణమని మండిపడ్డారు.
సినిమా షూటింగ్ తర్వాత తుందుర్రుకు వస్తానని పవర్ స్టార్ హామీ
సినీ నటుడు - జనసేన వ్యవస్థాపకుడు కొణిదెల పవన్ కల్యాణ్తో ఇటీవల కలిసిన ఇటీవల పోరాట కమిటీ నాయకులు ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంతో తలెత్తే అనర్దాలను వివరించారు. తాను షూటింగ్ లో ఉన్నానని, తర్వాత తుందుర్రులో పర్యటిస్తానని ఆయన వారికి చెప్పారని సమాచారం. గోదావరి మెగాఫుడ్ పార్క్ నిర్మాణం నిలిపివేసి మరో ప్రాంతానికి తరలించాలని, ఇక్కడ ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో రైతులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే మఫ్టీలో ఉన్న పోలీసులు తుందుర్రు, కంసాల బేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో భారీగా మోహరించారు. విజయవాడ తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రైతులను నిర్బందిస్తున్నారు. మూడు గ్రామాల రైతుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతియుత ఆందోళనకు అనుమతి పొందినా తమను అరెస్ట్ చేయడేమిటని రైతుల ప్రశ్నిస్తున్నారు.