మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి అరెస్ట్: హైదరాబాద్ తరలింపు
హైదరాబాద్: కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎమ్మిగనూరులోని తిక్కారెడ్డి నివాసానికి వచ్చిన హైదరాబాద్ పోలీసులు.. ఒక గంటపాటు ఆయనతో మాట్లాడారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద తిక్కారెడ్డి భాగస్వామిగా ఓ మద్యం పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ కోసం వరిపొట్టు కొనుగోలు చేసిన డబ్బులు ఇవ్వలేదని వారిపై ఓ కొందరు రైతులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష టన్నుల వరి పొట్టుకు రూ. 12 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం.
ఈ కేసులో తిక్కారెడ్డిని 3వ ముద్దాయిగా చేర్చినట్లు తెలిసింది. ప్రస్తుతం తిక్కారెడ్డి తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, తిక్కారెడ్డి అరెస్టును స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కుమ్మక్కై రెండు రాష్ట్రాల్లోని తమపార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నాయని మండిపడ్డారు. తిక్కారెడ్డిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రెండుసార్లు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలినాగిరెడ్డి ఆయనపై గెలుపొందారు. మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్గా కొనసాగుతున్న తిక్కారెడ్డికి పలు వ్యాపారాలున్నాయి.