టిక్టాక్ ఎంత పనిచేసింది.. వద్దన్న వీడియోలు, ఇల్లాలిపై అనుమానం, అనాధలుగా...
ఔత్సాహికులతో ఉన్న ప్రతిభను టిక్ టాక్ ఏమాత్రం వెలికితీస్తుందో తెలియదు కానీ.. గొడవలకు కారణమవుతుంది. ఘర్షణను మించి హత్యలు కూడా జరగడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కుటుంబాలను విచ్చిన్నం చేస్తోంది. ఇటీవల కొందరు దీంతో గొడవలు పడ్డ సందర్భాలు కూడా వెలుగుచూశాయి. కానీ ఒంగోలులో ఓ వివాహిత హత్య కలకలం రేపుతోంది.
పచ్చని సంసారంలో..
కనిగిరిలోని జవహర్ నగర్కు చెందిన ఫాతిమా, చిన్నపాచు దంపతులు. వీరికి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఫాతిమాకు టిక్ టాక్ పిచ్చి పట్టుకుంది. ఎంతలా అంటే భర్త చెప్పిన వినిపించుకోనంత మైకంలో ఉంది. టిక్ టాక్ వీడియోలపై భార్య భర్తలకు తరచూ గొడవ జరిగింది. గత నెల 27వ తేదీన ఘర్షణ పీక్కి చేరింది. టిక్ టాక్ వీడియోలపైనే వారి మధ్య గొడవ జరిగింది. అలా మాటా మాటా పెరిగింది.
పట్టనట్లు ఉంటే..
భర్త చిన్నపాచు మాటను ఫాతిమా లెక్కచేయలేదు. అలాగే చేస్తానని ధిక్కార స్వరం వినిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చిన్నపాచు.. పక్కనే ఉన్న చపాతీ కర్రతో దాడిచేశాడు. అంతటితో ఆగకుండా గొంతునులిమి హత్య చేశాడు. తర్వాత భయపడి.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఫ్యాన్కు వేలాడదీశాడు. ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. కానీ ఫాతిమా తల్లి.. తన కూతురు సూసైడ్ చేసుకుందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదీ విషయం..
చిన్నపాచును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది. తన భార్యను తానే హత్య చేసినట్టు చిన్నపాచు అంగీకరించాడు. వీడియోలు తీయొద్దనే అంశంపై గొడవ జరిగినట్టు అంగీకరించాడు. దీంతోపాటు తన భార్యపై అనుమానం ఉందని తెలిపాడు. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందా అని అనుమానించానని తెలిపాడు. అలా అనుమానం పెనుభూతమై.. ఫాతిమా మరణానికి దారితీసింది.
కట్టుకున్న భార్యనే..
కడదాకా తోడుంటానని చెప్పిన చిన్నపాచు.. తన భార్యనే మట్టుబెట్టాడు. టిక్ టాక్ వీడియోలు తరచూ చేయడంతో అతనికి అనుమానం మరింత బలపడింది. మరొకరితో సన్నిహితంగా ఉంటుందని భావించి.. మాటలతో వేధించాడు. తర్వాత గొంతునులిమి హతమార్చాడు. పచ్చని కాపురంలో చేజేతులా నిప్పులు పోసుకున్నాడు. అతని పిల్లలు ఇప్పుడు తల్లిలేని వారవడానికి కారణమయ్యాడు. ఉన్న కసాయి తండ్రి కూడా జైలుకు వెళ్లడంతో అనాధలుగా మారిపోయారు.